Sanju Samson: రాజస్థాన్ రాయల్స్తో విభేదాలు.. ఢిల్లీ క్యాపిటల్స్లోకి సంజూ?
రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ నుండి వైదొలిగారు. హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.
- Author : Gopichand
Date : 01-09-2025 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
Sanju Samson: సంజూ శాంసన్ (Sanju Samson) రాజస్థాన్ రాయల్స్ మధ్య సంబంధాలు సరిగా లేవని సమాచారం. వచ్చే ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ తరపున ఆడటానికి సంజూ సుముఖంగా లేడు. తనను జట్టు నుండి విడుదల చేయాలని లేదా ట్రేడ్ చేయాలని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రాజస్థాన్ టీమ్ మేనేజ్మెంట్ను కోరారు. కొన్ని నివేదికల ప్రకారం.. రాజస్థాన్ టీమ్ ఇతర ఫ్రాంచైజీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోగా సంజూపై ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. సంజూ శాంసన్ రాజస్థాన్ నుండి విడిపోతే వచ్చే సీజన్లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడే అవకాశం ఉంది.
సంజూ శాంసన్ ఏ జట్టులోకి వెళ్తాడు?
సంజూ శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ దృష్టిలో ఉన్నాడు. ఒక సన్నిహిత ఢిల్లీ క్యాపిటల్స్ సోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. సంజూ రాజస్థాన్ నుండి విడిపోతే, అతనిని ఢిల్లీలో స్వాగతించవచ్చని పేర్కొంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్ సంజూ శాంసన్ మెగా ఆక్షన్కు ముందు జోస్ బట్లర్ను రిటైన్ చేయాలనుకున్నాడని, కానీ టీమ్ మేనేజ్మెంట్ అతని అభ్యర్థనను పట్టించుకోకుండా బట్లర్ను విడుదల చేసిందని నివేదికలు వచ్చాయి. రాజస్థాన్ సిమ్రాన్ హెట్మయర్ను రిటైన్ చేసింది. కానీ అతను గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ 9వ స్థానంలో నిలిచి టోర్నమెంట్ను ముగించింది. 14 మ్యాచ్లలో కేవలం 4 మ్యాచ్లలో మాత్రమే జట్టు విజయం సాధించింది.
Also Read: Peter Navarro: ట్రంప్ సలహాదారు భారత్పై కీలక వ్యాఖ్యలు.. ఎవరీ పీటర్ కెంట్?
రాజస్థాన్ నుండి వైదొలిగిన రాహుల్ ద్రవిడ్
రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ నుండి వైదొలిగారు. హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. ద్రవిడ్ వెళ్లిపోవడంతో వచ్చే సీజన్లో సంజూ శాంసన్ రాజస్థాన్ తరపున ఆడటం చాలా కష్టంగా కనిపిస్తోంది.