టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్.. వర్షం పడి మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?
భారత జట్టు ఇప్పటివరకు రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంది. భారత్ 2007లో మొదటిసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలవగా, 2024లో రెండోసారి కైవసం చేసుకుంది.
- Author : Gopichand
Date : 07-03-2026 - 5:18 IST
Published By : Hashtagu Telugu Desk
T20 World Cup Final: భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. రెండు జట్లు అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్కు చేరుకున్నాయి. న్యూజిలాండ్ మొదటి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించగా, భారత్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్పై విజయం సాధించింది. అయితే ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఛాంపియన్ ఎవరు అవుతారు? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఐసీసీ నియమం ఏం చెబుతోంది?
భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు తక్కువగానే ఉంది. అయినప్పటికీ మ్యాచ్ సమయంలో వర్షం కురిస్తే సమయాన్ని బట్టి అంపైర్లు ఓవర్లను కుదించవచ్చు. ఒకవేళ వర్షం ఎక్కువగా ఉండి ఆట సాధ్యం కాకపోతే ఈ మ్యాచ్ కోసం ‘రిజర్వ్ డే’ కూడా కేటాయించారు. అయితే రిజర్వ్ డే రోజున కూడా ఫలితం తేలకుంటే ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు జట్లకు ట్రోఫీని పంచుతారు. భారత్- న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
Also Read: రేపే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ గుడిలో మహిళలకు ఉచిత, ప్రత్యేక దర్శనం!
వాతావరణం ఎలా ఉంది?
మార్చి 8న అహ్మదాబాద్లో ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వర్షం పడే అవకాశం 0 శాతం మాత్రమే ఉంది. తేమ 22 శాతంగా ఉండగా, గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీయనుంది. రోజంతా ఆకాశం నిర్మలంగా, ఎండగా ఉంటుంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. ఈ మ్యాచ్లో వర్షం అంతరాయం కలిగించే అవకాశం అస్సలు లేదు.
మూడో ట్రోఫీపై భారత్ కన్నేసింది
భారత జట్టు ఇప్పటివరకు రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకుంది. భారత్ 2007లో మొదటిసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలవగా, 2024లో రెండోసారి కైవసం చేసుకుంది. మరోవైపు న్యూజిలాండ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. కివీస్ జట్టు తమ తొలి టైటిల్పై కన్నేసింది.