IND vs SA 2nd Test ఈడెన్ గార్డెన్స్లో ఎర్రమట్టితో స్పెషల్ పిచ్..!
- By Vamsi Chowdary Korata Published Date - 10:31 AM, Wed - 19 November 25
కోల్కతా పిచ్ వివాదం తర్వాత, బీసీసీఐ ప్రయోగాలకు స్వస్తి పలికింది. రెండో టెస్టుకు సంప్రదాయ ఎర్రమట్టి పిచ్ను గువాహటిలో సిద్ధం చేస్తున్నారు. ఈ పిచ్ బౌన్స్తో పాటు స్పిన్కు అనుకూలంగా ఉంటుందని, అయితే అస్థిరత్వం లేకుండా ఉంటుందని క్యూరేటర్లు చెబుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్పై చర్చలను ఆపాలని చెప్పాడు. ఆటగాళ్ల మానసిక, నైపుణ్య మెరుగుదలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏ పిచ్లో అయినా ఆడే ఆటగాళ్లే ముఖ్యమని చెప్పేశాడు.
కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో సౌతాఫ్రికాపై చావు దెబ్బ తిన్న తర్వాత బీసీసీఐ ప్రయోగాలకు నో చెప్పింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ ప్రభావం తర్వాత రెండో టెస్టుకు సంప్రదాయ పిచ్లకే భారత్ మొగ్గు చూపింది. నవంబర్ 22 నుంచి గువాహటి వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు కోసం ఎర్రమట్టి పిచ్ సిద్ధమవుతోంది. ఈడెన్ గార్డెన్స్లో కనిపించిన అస్థిరత్వం లేకుండా బౌన్స్ వచ్చేలా క్యూరేటర్లు తయారు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈడెన్ గార్డెన్స్ పిచ్పై చాలా విమర్శలు వచ్చినప్పటికీ క్యూరేటర్ సుజన్ ముఖర్జీకి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్గా నిలబడ్డాడు. ఆ పిచ్ పూర్తిగా తన అభ్యర్థన మేరకే తయారు చేశారని గంభీర్ ఒప్పుకున్నాడు. రెండో టెస్టుకు ముందు ఇలాంటి పిచ్ వ్యూహాలను వెనక్కి తీసుకున్నా.. క్యూరేటర్పై ఎలాంటి ఆరోపణలు రాకుండా పూర్తి బాధ్యతే గంభీరే తీసుకున్నాడు.
నేషనల్ మీడియా వార్తల ప్రకారం గువాహటి రెండో టెస్ట్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండడమే కాదు, స్పీడ్ – బౌన్స్తో తిరగడం కూడా ప్రధాన లక్షణమవుతుంది. బీసీసీఐ వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం ఎర్రమట్టి పిచ్లు సహజంగా వేగం, బౌన్స్ ఎక్కువగా అందిస్తాయి. క్యూరేటర్లు కూడా ఎక్కువ బౌన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఒక బీసీసీఐ వర్గం తెలిపిందేమంటే.. “ఈ పిచ్ రెడ్ సాయిల్తో తయారు అవుతోంది. సహజంగానే వీటిలో స్పీడ్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా హోం సీజన్ ప్రారంభానికి ముందే తమ డిమాండ్లు స్పష్టంగా చెప్పింది. అందుకే పిచ్ టర్న్ ఇస్తే, అది వేగంతో పాటు బౌన్స్తో వస్తుంది. ఎక్కువ వేరియబుల్ బౌన్స్ ఉండకుండా క్యూరేటర్లు కృషి చేస్తున్నారు.”
ఆదివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో గువాహటి పిచ్ కూడా కోల్కతా పిచ్లానే ఉంటుందా అని గంభీర్ను ప్రశ్నించారు. దానికి ఆయన తాను తొలి రోజు నుంచే టర్న్ ఇస్తున్న పిచ్ కావాలని ఎప్పుడూ కోరలేదని స్పష్టం చేశాడు. తనకు ప్రత్యేక పిచ్ అభిరుచి లేదని, ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే జట్టును తయారు చేయడమే తన లక్ష్యమని చెప్పాడు.
“టర్నింగ్ వికెట్ అయినా, తొలి రోజు నుంచే ఎక్కువ టర్న్ ఉండకూడదు. టాస్ కీలకమవకుండా ఉండాలి. మేమెప్పుడూ చెడ్డ పిచ్లు లేదా ర్యాంక్ టర్నర్లు కావాలని అనలేదు. ఈ మ్యాచ్ గెలిచి ఉండి ఉంటే, ఎవరూ పిచ్ గురించి మాట్లాడరు. మేము మానసికంగా, నైపుణ్య పరంగా మెరుగుపడాలి, పిచ్పై చర్చలు ఆపాలి. ఎందుకంటే పిచ్ రెండు జట్లకూ ఒకటే. గువాహటి ఏ పిచ్ ఇచ్చినా, ఆ పరిస్థితుల్లో ఆడగలిగే ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు” అని గంభీర్ అన్నాడు.