CSKకు తొలి విజయం.. కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు ఫైన్!
ఐపీఎల్ 2026లో తొలి విజయం తర్వాత రుతురాజ్ గైక్వాడ్ సంతోషం వ్యక్తం చేస్తూ పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ 200-210 పరుగులు చేయడం శుభపరిణామమని అన్నాడు.
- Author : Gopi
Date : 12-04-2026 - 11:45 IST
Published By : Hashtagu Telugu Desk
Gaikwad Fined: శనివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఐపీఎల్ 2026లో సిఎస్కేకు ఇదే తొలి విజయం. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 212 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 56 బంతుల్లో నాటౌట్గా 115 పరుగులు చేయగా, అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఆయుష్ మ్హత్రే 36 బంతుల్లో 39 పరుగులు చేశాడు.
స్లో ఓవర్ రేట్ కారణంగా రుతురాజ్ గైక్వాడ్పై జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్లో జట్టు చేసిన మొదటి తప్పు కావడంతో కేవలం కెప్టెన్పైనే 12 లక్షల రూపాయల జరిమానా పడింది.
Also Read: ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం.. ఇప్పుడు ఏం జరగబోతుంది?
రుతురాజ్ గైక్వాడ్పై జరిమానా
ఐపీఎల్ తన స్టేట్మెంట్లో ఇలా పేర్కొంది. ఐపీఎల్ 2026లోని 18వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ఆడుతున్నప్పుడు కనీస ఓవర్ రేట్ పాటించనందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు జరిమానా విధించడమైనది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇది ఈ సీజన్లో ఆ జట్టు చేసిన మొదటి తప్పు కాబట్టి గైక్వాడ్కు 12 లక్షల రూపాయల జరిమానా విధించడమైనది అని ప్రకటనలో రాసుకొచ్చింది.
బౌలర్లకు క్రెడిట్ ఇచ్చిన గైక్వాడ్
ఐపీఎల్ 2026లో తొలి విజయం తర్వాత రుతురాజ్ గైక్వాడ్ సంతోషం వ్యక్తం చేస్తూ పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ 200-210 పరుగులు చేయడం శుభపరిణామమని అన్నాడు. సంజూ శాంసన్, ఆయుష్ మ్హత్రే బ్యాటింగ్ను మెచ్చుకుంటూనే ఈ రోజు బౌలర్లదేనని చెప్పాడు. ఈ మ్యాచ్లో జేమీ ఓవర్టన్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఆరంభాన్ని పొందినప్పటికీ 5 ఓవర్లలో 61 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (18) వికెట్ పడటంతో అక్కడి నుండి వరుసగా వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఓడిపోయింది.