IPL 2026 : సూర్యవంశీ విధ్యంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్
- Author : Prasad
Date : 28-05-2026 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్, జోఫ్రా ఆర్చర్ ఘాటైన బౌలింగ్తో సన్రైజర్స్ హైదరాబాద్పై 47 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చాడు. ఈ మ్యాచ్లో 12 భారీ సిక్సర్లు సూర్యవంశీ కొట్టాడు. అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ రికార్డును తృటిలో కోల్పోయినా, తన అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించాడు. సూర్యవంశీకి తోడుగా ధ్రువ్ జురెల్ 21 బంతుల్లో 50 పరుగులతో రాణించగా, యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేశాడు. అయితే చివరి ఓవర్లలో సన్రైజర్స్ బౌలర్లు పుంజుకోవడంతో రాజస్థాన్ స్కోరు పెరగకుండ కట్టడి చేశారు. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు జోఫ్రా ఆర్చర్ షాక్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వంటి కీలక బ్యాటర్లను వరుసగా ఔట్ చేసి హైదరాబాద్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. దీంతో సన్రైజర్స్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఆ మ్యాచ్ విజేత ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడుతుంది.