నేడు భారత్- జింబాబ్వే మధ్య మ్యాచ్.. ‘డ్యూ క్యూర్’ ఉపయోగం?!
భారత్- జింబాబ్వే రెండు జట్లు కూడా తమ గత సూపర్-8 మ్యాచ్లలో ఓడిపోయి ఇక్కడికి చేరుకున్నాయి. భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోగా, జింబాబ్వే వెస్టిండీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
- Author : Gopichand
Date : 26-02-2026 - 3:33 IST
Published By : Hashtagu Telugu Desk
India vs Zimbabwe: భారత్- జింబాబ్వే మధ్య జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 అత్యంత కీలకమైన సూపర్-8 పోరు నేడు చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరగనుంది. గత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత సెమీఫైనల్ చేరేందుకు టీమ్ ఇండియాకు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’ (గెలవక తప్పని) పరిస్థితిగా మారింది.
ఈ కీలక మ్యాచ్కు ముందు చేపాక్ స్టేడియంలో చేసిన ఒక ప్రత్యేక ఏర్పాటు ఇప్పుడు చర్చనీయాంశమైంది. నివేదికల ప్రకారం.. మైదానంలో ‘డ్యూ క్యూర్’ (Due Cure) అనే దిగుమతి చేసుకున్న కెమికల్ను చల్లారు. అమెరికా నుండి తెప్పించిన ఈ కెమికల్ ఉద్దేశ్యం రాత్రిపూట మ్యాచ్ సమయంలో పడే ‘మంచు’ ప్రభావాన్ని తగ్గించడం.
Also Read: Vijay – Rashmika Wedding Food Menu : విజయ్-రష్మిక పెళ్లి విందులో అదరగొట్టిన తెలంగాణ వంటకాలు
ఈ చర్య ఎందుకు అవసరమైంది?
చెన్నైలో రాత్రిపూట జరిగే మ్యాచ్లలో మంచు అనేది ప్రధాన సమస్యగా మారుతుంది. రెండో ఇన్నింగ్స్లో బంతి తడిగా మారడం వల్ల బౌలర్లు తమ లైన్ అండ్ లెంగ్త్ను నియంత్రించడం కష్టమవుతుంది. ముఖ్యంగా స్పిన్నర్లకు బంతిపై పట్టు (గ్రిప్) దొరకదు. ఇది బ్యాటర్లకు షాట్లు ఆడటాన్ని సులభతరం చేస్తుంది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. మ్యాచ్ సమయంలో హ్యూమిడిటీ (తేమ) 80 నుండి 90 శాతం వరకు ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్లో బంతి తడిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే గ్రౌండ్ స్టాఫ్ మంగళవారం, బుధవారం మైదానంలో ‘డ్యూ క్యూర్’ చల్లారు. మ్యాచ్కు ముందు కూడా దీనిని మరోసారి ఉపయోగించే ప్లాన్ చేస్తున్నారు.
టాస్ పాత్ర కీలకం
సాధారణంగా చేపాక్ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ మంచు పడితే పరిస్థితులు మారిపోతాయి. తడి బంతితో స్లోయర్ బంతులు, యార్కర్లు వేయడం అంత సులభం కాదు. అటువంటి సమయంలో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతుంది. తద్వారా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేటప్పుడు మంచు వల్ల కలిగే ప్రయోజనాన్ని పొందవచ్చు.
భారత్- జింబాబ్వే రెండు జట్లు కూడా తమ గత సూపర్-8 మ్యాచ్లలో ఓడిపోయి ఇక్కడికి చేరుకున్నాయి. భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోగా, జింబాబ్వే వెస్టిండీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మరి ఈ కొత్త కెమికల్ మంచు ప్రభావాన్ని తగ్గించి, ఇరు జట్లకు సమాన అవకాశాలు కల్పిస్తుందో లేదో చూడాలి.