గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!
టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ స్పిన్నర్ల ముందు తలవొంచుతోంది.
- Author : Gopichand
Date : 28-12-2025 - 4:20 IST
Published By : Hashtagu Telugu Desk
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి టెస్ట్ క్రికెట్లో టీమ్ ఇండియా పరిస్థితి ఆశాజనకంగా లేదు. న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై ఘోర పరాజయం పాలవ్వడం, ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా మూడోసారి గెలవాలనే కల చెదిరిపోవడం అభిమానులను నిరాశకు గురిచేశాయి. దీనికి తోడు దక్షిణాఫ్రికా కూడా భారత్ కోటను బద్దలు కొట్టడంలో విజయం సాధించింది. టెస్టుల్లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో గంభీర్ కోచింగ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ను టెస్ట్ కోచ్గా నియమిస్తారనే పుకార్లు కూడా షికారు చేశాయి. అయితే ఈ అంశంపై బీసీసీఐ తొలిసారిగా స్పందించింది.
గంభీర్ విషయంలో బీసీసీఐ మౌనం వీడింది
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్ను టెస్ట్ కోచ్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. వీటిని కేవలం పుకార్లుగా ఆయన కొట్టిపారేశారు. సైకియా మాట్లాడుతూ.. “గౌతమ్ గంభీర్ విషయంలో ఎటువంటి చర్చా జరగలేదు. అలాగే మరో కోచ్ను కూడా మేము సంప్రదించలేదు. ఇవన్నీ కేవలం వట్టి పుకార్లు మాత్రమే” అని స్పష్టం చేశారు. గంభీర్ తన ఒప్పందం ప్రకారం భారత జట్టుతో కొనసాగుతారని, ప్రస్తుతం ఆయన పదవికి ఎటువంటి ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా కోచింగ్ స్టాఫ్లో మార్పులు చేసే ఆలోచన కూడా లేదని బీసీసీఐ కార్యదర్శి తేల్చి చెప్పారు.
Also Read: మహిళలు గర్భవతి అని తెలిపే శరీర మార్పులు ఇవే!
టెస్టుల్లో టీమ్ ఇండియా ఇబ్బందులు
టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ స్పిన్నర్ల ముందు తలవొంచుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ను భారత్ సొంతగడ్డపైనే 0-2తో కోల్పోయింది. సిరీస్లోని రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా భారత టెస్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.