Sports Governance Bill: రాష్ట్రపతి వద్దకు జాతీయ క్రీడా పరిపాలన బిల్లు.. బీసీసీఐపై ప్రభావం ఎంత?
ఈ బిల్లు భారతదేశం 2036 ఒలింపిక్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వాలన్న లక్ష్యాన్ని బలపరచడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇతర అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది.
- Author : Gopichand
Date : 13-08-2025 - 7:22 IST
Published By : Hashtagu Telugu Desk
Sports Governance Bill: జాతీయ క్రీడా పరిపాలన బిల్లు (Sports Governance Bill) 2025 పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబడింది. భారత క్రీడా రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ఈ బిల్లును ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణిస్తున్నారు. కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రవేశపెట్టిన ఈ బిల్లు భారత క్రీడా పరిపాలనను ఆధునిక, పారదర్శక, జవాబుదారీ, క్రీడాకారుల కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2011 నాటి జాతీయ క్రీడా అభివృద్ధి సంహిత స్థానంలో చట్టబద్ధంగా అమలులోకి రానుంది.
బీసీసీఐపై ప్రభావం
ఈ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇకపై పూర్తిగా స్వతంత్రంగా ఉండలేదు. ఇది జాతీయ క్రీడా సమాఖ్య (NSB) పర్యవేక్షణలోకి వస్తుంది. ఈ బిల్లు ప్రకారం.. బీసీసీఐని సమాచార హక్కు (RTI) చట్టం పరిధిలోకి తీసుకొస్తారు. దీనివల్ల బీసీసీఐ తీసుకునే నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుంది. బీసీసీఐ కూడా ఇతర క్రీడా సంస్థల మాదిరిగానే క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది.
జాతీయ క్రీడా సమాఖ్యలలో మార్పులు
- క్రీడాకారులకు ప్రాతినిధ్యం: జాతీయ క్రీడా సమాఖ్యల (NSFs) కార్యనిర్వాహక కమిటీలలో కనీసం 25% మాజీ క్రీడాకారులు సభ్యులుగా ఉంటారు. మొత్తం సభ్యులలో కనీసం 10% మంది ప్రముఖ క్రీడాకారులు ఉంటారు.
- లింగ సమానత్వం: కార్యనిర్వాహక కమిటీలలో కనీసం 4 మంది మహిళలు సభ్యులుగా ఉండాలి.
- పదవీ కాల పరిమితి: సమాఖ్య అధ్యక్షులు, అధికారుల పదవీ కాలాన్ని గరిష్టంగా 12 సంవత్సరాలకు పరిమితం చేశారు. అలాగే నిర్వాహకుల వయో పరిమితిని 70 నుంచి 75 సంవత్సరాలకు పెంచారు. దీనివల్ల బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ వంటి వారికి ప్రయోజనం కలుగుతుంది.
Also Read: Sushil Kumar: ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
బిల్లులోని ఇతర ముఖ్య నిబంధనలు
జాతీయ క్రీడా బోర్డు (NSB): అన్ని క్రీడా సమాఖ్యలకు గుర్తింపు ఇవ్వడానికి NSBను ఏర్పాటు చేస్తారు. దీని సభ్యులను, అధ్యక్షుడిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. NSB నిధులు, పర్యవేక్షణ, క్రమశిక్షణ చర్యలు వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది.
ట్రిబ్యునల్ ఏర్పాటు: క్రీడాకారులు, సమాఖ్యల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. దీనికి సివిల్ కోర్టుల మాదిరిగానే అధికారాలు ఉంటాయి. దీని నిర్ణయాలను సుప్రీం కోర్టులో మాత్రమే సవాలు చేయవచ్చు.
ఆటగాళ్ల రక్షణ: మహిళా, మైనర్ క్రీడాకారుల రక్షణ కోసం POSH చట్టం 2013 ప్రకారం విధానాలను రూపొందించడం.
సమాచార హక్కు (RTI): అన్ని గుర్తింపు పొందిన క్రీడా సంస్థలను RTI పరిధిలోకి తీసుకొస్తారు.
పారదర్శక ఎన్నికలు: జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్ ద్వారా క్రీడా సమాఖ్యలలో న్యాయమైన ఎన్నికలు నిర్వహిస్తారు.
ఈ బిల్లు భారతదేశం 2036 ఒలింపిక్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వాలన్న లక్ష్యాన్ని బలపరచడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇతర అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది.