Sushil Kumar: ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ హైకోర్టు గతంలో సుశీల్ కుమార్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో అతను తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- By Gopichand Published Date - 06:20 PM, Wed - 13 August 25

Sushil Kumar: ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ (Sushil Kumar)కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధనఖర్ హత్య కేసులో అతనికి ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీనితో సుశీల్ కుమార్ ఒక వారంలోపు తిరిగి లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. సుశీల్ కుమార్ బెయిల్ను రద్దు చేయాలని సాగర్ ధనఖర్ తండ్రి అశోక్ ధనఖర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో సుశీల్ బెయిల్పై బయట ఉన్నప్పుడు సాక్షులపై ఒత్తిడి చేశాడని, ఈసారి కూడా అదే జరగవచ్చని ఆయన ఆరోపించారు. తమ కుటుంబంపై రాజీకి ఒత్తిడి చేస్తున్నారని కూడా ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసులో లభించిన వీడియో సాక్ష్యాలను పరిశీలించిన తరువాత సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని మార్చింది.
Also Read: CM Chandrababu : పులివెందులలో అరాచకాలు జరగలేదనే అసహనంలో జగన్ : సీఎం చంద్రబాబు
కేసు వివరాలు
ఈ ఘటన మే 5, 2021న ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగింది. సుశీల్ కుమార్, అతని అనుచరులు జూనియర్ రెజ్లర్ సాగర్ ధనఖర్ను దారుణంగా కొట్టారు. ఈ దాడిలో సాగర్ ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటనలో మరో నలుగురు రెజ్లర్లకు కూడా గాయాలయ్యాయి. ఈ కేసులో సుశీల్ కుమార్తో పాటు మొత్తం 13 మంది నిందితులపై హత్య, అపహరణ, క్రిమినల్ కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఢిల్లీ హైకోర్టు గతంలో సుశీల్ కుమార్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో అతను తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు విచారణలో సాక్షులు, బాధితుల కుటుంబంపై ఒత్తిడి రాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.