టీ20 వరల్డ్ కప్.. భారత్-పాక్ మ్యాచ్ జరగకుంటే రూ. 4,500 కోట్ల నష్టం?!
ప్రపంచంలో ఏ మూలన భారత్-పాక్ మ్యాచ్ జరిగినా స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఇతర మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ టికెట్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
- Author : Gopichand
Date : 02-02-2026 - 9:40 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో తలపడేందుకు పాకిస్థాన్ ఆఖరి నిమిషంలో నిరాకరించింది. గత ఆదివారం (ఫిబ్రవరి 01) పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (X) వేదికగా ఒక పోస్ట్ను షేర్ చేస్తూ.. తమ జట్టు రాబోయే టీ20 ప్రపంచకప్లో పాల్గొంటుందని, అయితే ఫిబ్రవరి 15న శ్రీలంకలో భారత్తో జరగాల్సిన మ్యాచ్లో మాత్రం బరిలోకి దిగదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 4,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఏదైనా వరల్డ్ కప్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ ఉంటుంది. దీనివల్ల భారీ స్థాయిలో ఆదాయం కూడా లభిస్తుంది. ఇప్పుడు ఈ మెగా పోరు జరగకపోతే అది తీవ్ర ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. భారత్-పాక్ మ్యాచ్ రద్దు కావడం వల్ల ఏయే రూపాల్లో ఈ 4,500 కోట్ల నష్టం జరుగుతుందో ఇక్కడ చూద్దాం.
Also Read: వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
ఏయే రూపాల్లో నష్టం వాటిల్లుతుంది?
టీ20 వరల్డ్ కప్లో భారత్-పాక్ మ్యాచ్ అంచనా విలువ సుమారు 500 మిలియన్ డాలర్లు (రూ. 4,500 కోట్లు). ఇందులో బ్రాడ్కాస్టింగ్ (ప్రసార హక్కులు), ప్రీమియం అడ్వర్టైజ్మెంట్స్, స్పాన్సర్షిప్స్, టికెట్ల విక్రయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు ఉన్నాయి. విలువ పరంగా చూస్తే భారత్-పాక్ మ్యాచ్కు ఉన్న క్రేజ్ మరే ఇతర మ్యాచ్కూ లేదు.
ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం: భారత్-పాక్ మ్యాచ్లో కేవలం ప్రకటనల ద్వారానే సుమారు 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. ఈ మ్యాచ్ కోసం 10 సెకన్ల అడ్వర్టైజ్మెంట్ స్లాట్ ధర రూ. 25 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు ఉంది. టోర్నమెంట్ మొత్తంలో ఇదే అత్యంత ఖరీదైన యాడ్ స్లాట్. ఈ మ్యాచ్ రద్దు అయితే వరల్డ్ కప్ మొత్తం ఆర్థిక ప్రణాళికే మారిపోతుంది.
భారత్- పాకిస్థాన్లకు భారీ నష్టం: మీడియా నివేదికల ప్రకారం ఈ మ్యాచ్ జరగకపోవడం వల్ల భారత్- పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు సుమారు 200 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
పీసీబీ (PCB)కి ఎదురుదెబ్బ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ (ICC) నుండి 5.75% రెవెన్యూ షేర్ లభిస్తుంది. ఇది సుమారు 34.51 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 316 కోట్లు). ఇప్పుడు ఐసీసీ నిబంధనల ఉల్లంఘన కింద పీసీబీ ఈ ఆదాయాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
టికెట్ల విక్రయాల ద్వారా నష్టం: ప్రపంచంలో ఏ మూలన భారత్-పాక్ మ్యాచ్ జరిగినా స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఇతర మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ టికెట్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మ్యాచ్ రద్దయితే టికెట్ల ఆదాయం ఉండదు. ఇప్పటికే టికెట్లు అమ్ముడుపోయి ఉంటే నిర్వాహకులు ఆ మొత్తాన్ని రీఫండ్ (తిరిగి చెల్లించడం) చేయాల్సి ఉంటుంది. దీనివల్ల భారీగా ఆర్థిక భారం పడుతుంది.