Burnt Alive: తిరుపతిలో దారుణం.. కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. ఓ వ్యక్తి సజీవ దహనం
తిరుపతి జిల్లా చంద్రగిరిలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కారుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటన జరిగింది. దీంతో ఓ వ్యక్తి సజీవ దహనం (Burnt Alive) అయ్యాడు.
- Author : Gopichand
Date : 02-04-2023 - 9:35 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుపతి జిల్లా చంద్రగిరిలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కారుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటన జరిగింది. దీంతో ఓ వ్యక్తి సజీవ దహనం (Burnt Alive) అయ్యాడు. వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జయరామయ్య కుమారుడు నాగరాజుకు, అతని తమ్ముడు పురుషోత్తంకు అదే గ్రామానికి చెందిన టిడిపి సర్పంచ్ చాణిక్య, అతని తమ్ముడు రప్పంజయతో గొడవలు ఉన్నాయి. ఈ గొడవలకు కారణం పురుషోత్తం గ్రామంలో యువతితో అక్రమ సంబంధం కలిగి ఉండడమేనని తెలుస్తోంది.
సర్పంచ్ అతను అనుచరులు నాగరాజును శనివారం రాత్రి పంచాయితీ నిర్వహించాలని పిలిచి చంద్రగిరికి తీసుకొచ్చారు. తరువాత ఏం అయ్యిందో తెలియదు కానీ చంద్రగిరి మండలం గంగుడుపల్లి కురపకణం వద్ద కారులో నాగరాజ సజీవ దహనమయ్యాడు. కారులో నాగరాజును తాడుతో కట్టి, డోర్ లాక్ చేసి కారుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. కారును లోయలోకి తోసేందుకు ప్రయత్నించారు. కారుకు ఓ రాయి అడ్డంకావడంతో కారులో మంటలు చెలరేగడంతో దుండుగులు పారిపోయినట్లు తెలుస్తోంది.
Also Read: Bomb Blast: బీహార్లోని ససారంలో బాంబు పేలుడు.. ఆరుగురికి గాయాలు
తమ బిడ్డను సర్పంచ్ చాణిక్య అతను అనుచరులే హత్యచేశారని నాగరాజు తండ్రి జయరామయ్య ఆరోపింపించారు. హత్యకు నాగరాజు తమ్ముడు పురుషోత్తం అదే గ్రామానికి చెందిన ఓ యువతితో అక్రమ సంబంధమే కారణమని స్థానికులు తెలుపుతున్నారు. సంఘటన స్థలాన్ని చంద్రగిరి సీఐ ఓబులేసు, ఎస్ఐ వంశీధర్, రామచంద్రాపురం పోలీసులు పరీశీలించారు. క్లూస్ టీం సైతం సంఘటన స్థలం పరీశీలించి ఆధారాలు సేకరించారు. చంద్రగిరి సీఐ ఓబులేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలంలో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
నా వల్లే అన్నను చంపారు
తిరుపతిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కారుతో సహా తగలబెట్టి చంపిన ఘటన కీలక మలుపు తీసుకుంది. రప్పంజయ, సర్పంచ్ నాగరాజు, గోపీ తన అన్నను చంపారని నాగరాజు తమ్ముడు ఆరోపిస్తున్నాడు. తాను రప్పంజయ భార్యతో సన్నిహితంగా ఉండటంతో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పాడు. ఆ విషయంపై మాట్లాడేందుకు వెళ్లిన తన అన్నను కొట్టి చంపారని వెల్లడించారు. తన తప్పుకు అన్న బలయ్యాడని వాపోయాడు.