Karnataka : సీఎం కుర్చీ ఖాళీగా లేదు: ఖర్గే మల్లికార్జున ఖర్గే
- Author : Vamsi Chowdary Korata
Date : 01-05-2026 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే మరోసారి స్పందించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని తెలిపారు. నాయకత్వ సమస్యపై నెలకొన్న గందరగోళాన్ని పార్టీ అధిష్ఠానం కూడా త్వరలోనే నివృత్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చని చెప్పారు.
కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తనను, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసి తమ అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపారు. లోక్ సభలో ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సరైన సమయంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి పదవి చేపడితే స్వాగతిస్తామని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర అన్నారు. ఈ ప్రకటనపై కూడా ఖర్గే స్పందించారు. ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదని, కాబట్టి అలాంటి చర్చకు తావులేదని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి కావాలని జి. పరమేశ్వరకు ఉండవచ్చు, మీరు (విలేకరులు) స్వాగతించవచ్చు, ఎవరైనా అంగీకరించవచ్చు కానీ ఈ విషయాలను నిర్ణయించేది సోనియా గాంధీ అని తెలిపారు.