శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ
- Author : Vamsi Chowdary Korata
Date : 06-03-2026 - 1:59 IST
Published By : Hashtagu Telugu Desk
Sivaji సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని.. ఈ డైలాగ్ రెండేళ్ల క్రితం ఓటీటీలో వచ్చిన ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్లో తొలిసారి వినిపించింది. ఆ డైలాగ్ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్గా వాడుతూ ఆ సిరీస్లో రన్ అయిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత అది పెద్ద మీమ్ మెటీరియల్ అయి వైరల్ అయిపోయింది. దీంతో అదే డైలాగ్ని సినిమా టైటిల్గా పెట్టి ఒక క్రైమ్ కామెడీతో ఆడియన్స్ని పలకరించారు శివాజీ-లయ.
శివాజీ స్వీయ నిర్మాణంలో ఈటీవీ విన్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా నేడు (మార్చి 6) థియేటర్లలో రిలీజ్ అయింది. మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా ఇలా మూడు సినిమాల్లో జంటగా నటించిన శివాజీ-లయ చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇందులో జంటగా కనిపించారు. మరి శివాజీ క్రైమ్ కామెడీ వర్కవుట్ అయిందా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ
నీతి, నిజాయితీ గల పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్ (శివాజీ). ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ వరకూ ఎవరు కాల్ చేసినా కూడా తప్పు చేయకుండా తన పని తాను నిజాయతీగా చేస్తుంటాడు. ఇక తన భార్య ఉత్తర (లయ), కొడుకు మిథిల్ (రోషన్).. చేసే పనులు చూసి తలబాదుకుంటూ ఉంటాడు. వాళ్లు సరదాగా చేసే పనులు ఏదో ఒకరోజు తన పీక మీదకి వస్తాయంటూ వెటకారం ఆడుతూ ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు.
అంతా బానే ఉందిగా అనుకునే సమయానికి దీపావళి రోజు తన ఇంటికి వచ్చిన ఊరి ఎస్ఐ విక్రమ్( ప్రిన్స్) హత్యకి గురవుతాడు. అసలు విక్రమ్ని ఎవరు చంపారు? ఈ క్రైమ్లో శ్రీరామ్ ఫ్యామిలీ ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది. అసలు విక్రమ్ శవాన్ని మాయం చేసి, ఈ క్రైమ్ నుంచి తప్పించుకోవాలని శ్రీరామ్ భార్య ఉత్తర వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందా? ఈ డ్రామాలో లోకల్ ఎమ్మెల్యేకి సంబంధమేంటి? అసలు చివరికి వీళ్ల ఫ్యామిలీ ఇందులోనుంచి ఎలా బయటపడింది అనేదే మిగిలిన కథ.
కష్టం సామీ
ఇలాంటి క్రైమ్ కామెడీ సినిమాలు టాలీవుడ్లో ఎక్కువే వచ్చాయ్. ముఖ్యంగా ఓటీటీలో ఇప్పటికే ఎన్నో సినిమాలున్నాయ్. కానీ లయ-శివాజీ కాంబో ఉండటం.. ట్రైలర్ మొత్తంలో జబర్దస్త్ కమెడియన్లు ఎక్కువగా కనిపించడం.. ఈటీవీ విన్ సమర్పణ అనడంతో కంటెంట్ విషయంలో పక్కాగా ఉంటుందేమోననే ఆంచానాలు కొంచెం ఉన్నాయి. కానీ థియేటర్లో మాత్రం ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకోవడం మాట పక్కన పెడితే కనీసం దరిదాపుల్లో కూడా లేదు.
శివాజీ-లయ మధ్య కెమిస్ట్రీని మినహాయించి ఇక ఏదీ పెద్దగా వర్కవుట్ కాలేదు. 90s బయోపిక్లో నవ్వులు పూయించిన కుర్రాడు రోషన్.. ఇందులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అసలు ఆ ట్రాక్ మొత్తం పెద్దగా ఎక్కదు. ఇక క్రైమ్లో వెతికిన కామెడీ కూడా అక్కడక్కడా కొన్ని నవ్వులకే పరిమితమైంది. కాస్తో కూస్తో ఇమ్మానుయేల్ తన నటనతో కాసేపు ఫన్ జనరేట్ చేశాడు. అసలు ఓటీటీకి ప్లాన్ చేసిన ఈ కంటెంట్ని థియేటర్లో రిలీజ్ చేద్దామని మళ్లీ ఎందుకు డెసిషన్ తీసుకున్నారో తెలీదు కానీ.. ఓటీటీకే పరిమితం చేసుంటే బావుండేదే అనే ఫీలింగ్ చూస్తున్నంత సేపు కలుగుతుంది.
ఫస్టాఫ్ కాస్త ల్యాగ్తో మొదలై.. ఎస్ఐ మర్డర్తో కథలో కాస్త వేగం పెరుగుతుంది. ఇక ఆ శవాన్ని మాయం చేసి కేసు నుంచి తప్పించుకోవాలని శివాజీ ఫ్యామిలీ చేసే ప్రయత్నాలన్నీ చూసినప్పుడు ‘దృశ్యం’ సినిమా గుర్తొస్తుంది. అలాగని దీన్ని అంత సీరియస్ ట్రాక్లో నడిపించారా అంటే అలా లేదు. ఎందుకంటే కొన్నికొన్ని సీన్లు రియాలిటీకి చాలా దూరంగా అనిపిస్తాయ్. ఉదాహరణకి మర్డర్ జరిగిన ఇంట్లో వాళ్లంతా సరదాగా ఒకరి మీద ఒకరు పంచులేసుకోవడం.. అసలు ఏమీ జరగలేదన్నట్లుగా తమ పనిలో తాము ఉండటం.. ఇవన్నీ చూస్తుంటే ఏంట్రా ఇది అనిపిస్తుంది.
సెకండాఫ్లో ఎస్ఐ మిస్సింగ్కి శ్రీరామ్కి ఏదో లింక్ ఉందనే కోణంలో కానిస్టేబుల్ ధన్రాజ్ కేసుని దర్యాప్తు చేయడం.. ఇవన్నీ ఊహకి అందే విధంగానే ఉంటాయి. అయితే క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ కొంత వరకూ బావుంది. కానీ దాన్ని రివీల్ చేసే విధానంలో మాత్రం డైరెక్టర్ ఆకట్టుకోలేకపోయారు. ఎందుకంటే దృశ్యం సినిమా పార్ట్ 1,2లో ట్విస్ట్ రివీల్ అయ్యే టైమ్లో ఉండే ఉత్కంఠ వేరే విధంగా ఉంటుంది. కానీ ఇందులో ఎక్కడా అలా అనిపించదు.
నటన విషయానికొస్తే శివాజీ ఎప్పటిలానే యాక్టింగ్ వరకూ తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఎమోషనల్ సీన్లలో కూడా తన నటన పదను చూపించాడు. కానీ ఆ ఎమోషనల్ సీన్లలో బలం లేకపోవడంతో పెద్దగా వర్కవుట్ కాలేదు. లయ కాస్త కామెడీ, ఇంకాస్త క్రిమినల్ మైండ్ ఉన్న క్యారెక్టర్లో ఫర్వాలేదనిపించారు. ఇక రోషన్ చేసిన కామెడీ ఎక్కలేదు. ఆలీ, ధన్రాజ్, ప్రిన్స్, కాదంబరి, చిత్రం శీను సహా మిగిలినవారంతా తమ పాత్రలకి ఉన్నంతలో చెప్పినంతలో న్యాయం చేశారు. ఇక సినిమా అయిపోయాక ఎండ్ కార్డ్స్ పడుతుండగా బండ్ల గణేష్ చేత చేయించిన పాయ పాయ సాంగ్ కూడా థియేటర్లో ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. ఈ పాట చూసిన తర్వాత పాయ పాయ.. సినిమా కూడా పాయె అన్న ఫీలింగ్ కలుగుతుంది!