Weather Report: వాతావరణశాఖ అంచనాలు తారుమారు.. మాయమైన ‘రెడ్ అలర్ట్’
- Author : Vamsi Chowdary Korata
Date : 18-10-2024 - 2:17 IST
Published By : Hashtagu Telugu Desk
చెన్నై నగరానికి వాతావరణశాఖ ఇచ్చిన వర్ష సూచనలు తారుమారయ్యాయి. 15న ‘ఆరెంజ్’ అలర్ట్ ఇచ్చినా, అదేరోజు ఉదయం అది ‘రెడ్ అలర్ట్’గా మారింది. 16న కూడా ‘రెడ్ అలర్ట్’ ప్రకటించబడినా, నగరంలో చాలాచోట్ల వర్షాలు లేకపోవడం ప్రజలను గందరగోళానికి గురిచేసింది.
గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వాయుగుండం బలహీనపడి, తీవ్ర అల్పపీడనంగా మారి చెన్నైకు ఉత్తరంగా తీరం దాటింది. ఆ తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించింది. అయితే, తీరం దాటినప్పుడు వర్షాలు కురవకుండా వెళ్లడమే అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అది కాకా, చెన్నైలో ఎండ కూడా కనిపించడం మరో ఆశ్చర్యం.
వాతావరణ అంచనాలు తప్పాయి. గురువారం చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించిన వాతావరణశాఖ, కొన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. కానీ, బుధవారం పరిస్థితులు మారడంతో, గురువారం కూడా నగరంలో వర్షం లేకుండా ఉన్నందున ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో కేవలం కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షాలు కురిశాయి.
వాతావరణ నిపుణుడు ప్రదీప్ జాన్ మాట్లాడుతూ, “వాతావరణ హెచ్చరికలను గౌరవించాలి. కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు పడుతాయనే సూచనలు వచ్చినా, పరిస్థితులు మారవచ్చు.” ఆయన 15, 16 తేదీల్లో 20 సెం.మీ. వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు 75 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. 15, 16 తేదీల్లో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో 891 చెరువులు జలాలతో కళకళలాడుతున్నాయని అధికారులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా కన్యాకుమారిలో 310, మదురైలో 244 చెరువులు ఉన్నాయని వెల్లడించారు. ఉత్తర తమిళనాడు తీర జిల్లాలు, డెల్టా జిల్లాలో 180 చెరువుల్లో భారీగా నీళ్లు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14,139 చెరువులుంటే, అందులో 1,832 చెరువుల్లో 75% మరియు 2,096 చెరువుల్లో 50% కంటే ఎక్కువ నీరు చేరిందని తెలిపారు. కోయంబత్తూరు, దిండుక్కల్ మరియు ఈరోడ్ జిల్లాల్లోని పలు రిజర్వాయర్లకు నీరు బాగా చేరిందని అధికారులు చెప్పారు.