Parimal Nathwani : వైసీపీ ఎంపీ కొడుకు పెళ్లికి హాజరైన అతిరధ మహారథులు ..ముకేశ్ అంబానీ దంపతులు!
- By Vamsi Chowdary Korata Published Date - 02:19 PM, Tue - 25 November 25
వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కుమారుడు కరణ్ నత్వానీ వివాహానికి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. పరిమళ్ నత్వానీ.. ముకేశ్ అంబానీకి సన్నిహితుడిగా చెబుతుంటారు. అప్పటికే రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పరిమళ్ నత్వానీని.. 2020లో వైసీపీ మరోసారి పెద్దల సభకు పంపించింది.
వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కొడుకు కరణ్ నత్వానీ- ద్వేత వివాహానికి ముకేశ్ అంబానీ దంపతులు హాజరయ్యారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ పెళ్లికి వచ్చి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త దంపతులు వీరి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ముకేశ్ అంబానీ ఫ్యామిలీతో పాటు శివసేన (ఉద్ధవ్) పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఐసీసీ చైర్మన్ జై షా, బాలీవుడ్ నటుడు పరేష్ నర్వల్తో పాటు తదితర సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
పరిమళ్ నత్వానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతనిధ్యం వహిస్తున్నారు. వైసీపీ పార్టీ ఆయన్ను పెద్దల సభకు పంపించింది. 2020 జూన్ 22 నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. పరిమళ్ నత్వానీ 2008 నుంచి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2008లో మొదటి సారి జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014లోనూ ఝార్ఖండ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
మరోసారి ఆయన్ను రాజ్యసభకు పంపించేందుకు చాలా తతంగమే జరిగింది. స్వయంగా రంగంలోకి దిగిన ముకేశ్ అంబానీ.. ఆంధ్రప్రదేశ్ నుంచి పరిమళ్ నత్వానీని రాజ్యసభకు పంపాలని వైసీపీ అధినేత జగన్ను కోరినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా బీజేపీ కూడా నత్వానీకి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 2020 మార్చి 11న వైసీపీలో చేరిన పరిమళ్ నత్వానీ.. మొత్తానికి రాజ్యసభ మెంబర్ అయ్యారు.
పరిమళ్ ధీరజ్లాల్ నత్వానీ 1997లో రిలయన్స్ గ్రూప్లో చేరారు. 2016 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్ గ్రూప్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించారు. ముకేశ్తో పాటు ఆయన తండ్రి ధీరూభాయి అంబానీతోనూ పరిమళ్ నత్వానీ కలిసి పని చేశారు. గుజరాత్లోని జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ కోసం.. దాదాపు 10 వేల ఎకరాల భూమిని సేకరించడంలో పరిమళ్ నత్వానీ కీలక పాత్ర పోషించారు.
రిలయన్స్ జియో 4జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులోనూ నత్వానీ కీలకంగా వ్యవహరించారు. వ్యాపారంతో పాటు క్రీడా రంగంలోనూ పరిమళ్ నత్వానీ ముద్ర ఉంది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు. పరిమళ్ నత్వానీకి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక పరిమళ్.. ముకేశ్ అంబానీకి చాలా దగ్గరి వ్యక్తి అని చెబుతారు. అందుకే.. బీజేపీ, ముకేశ్ అంబానీకి మధ్య ఒక సంధానకర్తగా నత్వానీ ఉంటారని అంటుంటారు.