Surgical Strike : మోడీ సీరియస్.. పాక్పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా ?
కశ్మీరులో ఉగ్రదాడి(Surgical Strike) నేపథ్యంలో.. భారత్ ప్రతీకార దాడికి పాల్పడే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ సైన్యం అలర్ట్ అయింది.
- By Pasha Published Date - 10:15 AM, Wed - 23 April 25

Surgical Strike : జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులు లక్ష్యంగా మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని మోడీ అత్యవసరంగా సమీక్షించారు. సౌదీ అరేబియా నుంచి భారత్కు చేరుకున్న మోడీ.. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శిలతో భేటీ అయ్యారు. వారి నుంచి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తమ పనే అని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తైబాకు అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF) ప్రకటించిన విషయాన్ని మోడీకి చెప్పారు. ప్రధాని మోడీ ఈ దాడి ఘటనపై సీరియస్ అయ్యారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమూకలను ఏరిపారేయాల్సిందే అని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో తదుపరిగా ఏం జరగబోతోంది ? పాకిస్తాన్పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
Also Read :The Resistance Front: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి వెనక ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. దాని చరిత్ర ఇదే!
సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం అలర్ట్
కశ్మీరులో ఉగ్రదాడి(Surgical Strike) నేపథ్యంలో.. భారత్ ప్రతీకార దాడికి పాల్పడే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ సైన్యం అలర్ట్ అయింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ యుద్ధ విమానాలను మోహరించింది. సరిహద్దు గగన తలంలో పహారా కోసం పాకిస్తాన్ నిఘా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలోలా భారత్ సర్జికల్ స్ట్రైక్కు దిగుతుందనే భయాలు పాకిస్తాన్కు ఉన్నాయి. గతంలో భారత్లో పాకిస్తాన్ హైకమిషనర్గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ ఈ అంశంపై స్పందిస్తూ.. ‘‘ఈసారి భారత్ స్పందించే అవకాశాలు ఉన్నాయి. ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ ఉంది. అయితే పాకిస్తాన్ కూడా అలర్ట్గానే ఉంటుంది. భారత్ దాడిని అడ్డుకుంటుంది. భారత్ ఒకవేళ దాడి చేస్తే.. పాకిస్తాన్ ప్రతిస్పందన కూడా కఠినంగానే ఉండొచ్చని అనుకుంటున్నాను’’ అని అభిప్రాయపడ్డారు.
Also Read :Pahalgam Terror Attack: పహల్గామ్లో ఉగ్రవాద దాడి.. ఎయిరిండియా సంచలన నిర్ణయం!
బాలాకోట్ తరహాలో..
బాలాకోట్ తరహా సర్జికల్ స్ట్రైక్కు భారత్ పాల్పడకుండా పాకిస్తాన్ వాయుసేన అన్ని చర్యలను తీసుకుంటుందని అబ్దుల్ బాసిత్ తెలిపారు. 2019లో జమ్మూకశ్మీరులోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేసిన ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీరులోని బాలాకోట్పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. తద్వారా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది.