ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే
- Author : Vamsi Chowdary Korata
Date : 29-01-2026 - 2:08 IST
Published By : Hashtagu Telugu Desk
Nirmala Sitharaman వార్షిక బడ్జెట్ 2026-27కి ముందు లోక్సభలో ఆర్థిక సర్వే 2026ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని, వచ్చే ఆర్థిక ఏడాదికి 7.2 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్కి ముందు ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరు, వచ్చే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పడమే ఎకనామిక్ సర్వే. ఆర్థిక శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను తయారు చేస్తుంది. మొదట 1950-51 ఏడాదిలో బడ్జెట్తో పాటే ఆర్థిక సర్వే ప్రవేశపెట్టగా 1960 నుంచి బడ్జెట్కి ముందే ప్రవేశపెడుతున్నారు.
కేంద్ర బడ్జెట్ 2026కు ముందు దేశ ఆర్థిక స్థితిగతులను ఆవిష్కరించే ఆర్థిక సర్వే 2025-26ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ తన వృద్ధి వేగాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తోందని సర్వే పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను దేశ వృద్ధి రేటు 7.2 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం.
ఆర్థిక సర్వే 2026లోని కీలక ముఖ్యాంశాలు
- జీడీపీ వృద్ధి రేటు (GDP Growth):వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.2 శాతం మధ్య ఉండవచ్చని సర్వే అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే అంచనాలను పెంచింది. అయితే 2025-26 అంచనాలను 7.4 శాతం నుంచి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ ఇదే స్థాయి వృద్ధిని కనబరచడం గమనార్హం.
- ద్రవ్యోల్బణం నియంత్రణ (Inflation Control):దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని సర్వే పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్దేశించిన 2-6 శాతం పరిధిలోనే ధరలు ఉన్నాయని, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని వివరించింది.
- మౌలిక సదుపాయాల కల్పన:ప్రభుత్వం ‘కాపెక్స్’ (Capital Expenditure) లేదా మూలధన వ్యయంపై పెట్టిన దృష్టి వల్ల దేశవ్యాప్తంగా రోడ్లు, రైల్వేలు, పోర్టుల నిర్మాణం వేగవంతమైంది. ఇది ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది.
- వ్యవసాయ రంగం వృద్ధి:గత ఏడాది సానుకూల రుతుపవనాల వల్ల వ్యవసాయ రంగం 4 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరగడానికి ఇది ప్రధాన కారణమని సర్వే విశ్లేషించింది.
- ఉపాధి కల్పన, నైపుణ్యం:దేశంలో నిరుద్యోగిత రేటు తగ్గుముఖం పట్టిందని, ముఖ్యంగా తయారీ రంగంలో మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా కొత్త ఉద్యోగాలు లభించాయని సర్వే తెలిపింది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడంపై మరింత దృష్టి సారించాలని సూచించింది.
- కరెంట్ అకౌంట్ లోటు (CAD):భారత ఎగుమతులు పెరగడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉండటం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి సురక్షితంగా ఉందని నివేదిక పేర్కొంది.
- ద్రవ్యలోటు:2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.8 శాతంగా ఉందని తెలిపింది. 2025-26 ఏడాదిలో అది 4.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
- తయారీ రంగం:దేశీయంగా తయారీ, ఎగుమతులు, ఎలక్ట్రానిక్ రంగం వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది. ఇందులో మొబైల్ తయారీ కీలకం కానుదని, పదేళ్లలో ఉత్పత్తి విలువ 30 రెట్లు పెరిగి రూ.18 వేల కోట్ల నుంచి రూ.5.45 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది.
అయితే వచ్చే ఆర్థిక ఏడాదిలో కొన్ని సవాళ్లను కూడా సర్వే ప్రస్తావించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు ప్రభావం చూపవచ్చని తెలిపింది. ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయాలు, కృత్రిమ మేధ (AI) వల్ల ఉపాధి రంగంలో మార్పులు ఉంటాయని అంచనా వేసింది. ఆర్థిక సర్వే 2026 భారతదేశాన్ని ‘స్థిరమైన, ఆశాజనకమైన’ దేశంగా చిత్రించింది. ఈ గణాంకాల ఆధారంగా ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఎలాంటి రాయితీలు ఉంటాయోనని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.