Lok Sabha Speaker : రేపే లోక్సభ స్పీకర్ ఎన్నిక.. ఏ పద్ధతిలో జరగబోతోంది ?
దేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి రేపు (బుధవారం) ఎన్నిక జరగబోతోంది.
- Author : Pasha
Date : 25-06-2024 - 6:48 IST
Published By : Hashtagu Telugu Desk
Lok Sabha Speaker : దేశ చరిత్రలోనే తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి రేపు (బుధవారం) ఎన్నిక జరగబోతోంది. అధికార ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా, విపక్ష ఇండియా కూటమి తరఫున కె.సురేష్ తలపడుతున్నారు. అయితే ఈ ఎన్నిక విధానం ఎలా జరగబోతోంది ? అనే దానిపై ప్రస్తుతం డిస్కషన్ నడుస్తోంది. రాజ్యాంగ నిపుణులు దీనిపై ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
సాధారణంగానైతే లోక్సభలో ఎంపీలతో అంతర్గత ఓటింగ్ను నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ డిస్ప్లే వ్యవస్థను వినియోగిస్తుంటారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు దానిపై అవగాహన లేదు. అయితే ఈ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలంటే ఎంపీలకు అందరికీ తప్పకుండా సీటు నంబర్లను కేటాయించాలి. అయితే ఈ సీటు నంబర్ల కేటాయింపు ఇంకా జరగలేదు. సీటు నంబర్లను కేటాయించాలన్నా కొన్ని రోజుల టైం పడుతుంది. రేపు(బుధవారం) స్పీకర్ ఎన్నిక ఉన్నందున.. ఆలోగా ఎంపీలకు సీట్ల నంబర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశమే లేదు. దీంతో పేపరు స్లిప్పుల ద్వారా ఎంపీలు ఓట్లు పోల్ చేసే పద్ధతిని వాడుకునే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణుడు, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి అన్నారు. లోక్సభలో ఒకే పార్టీకి ఫుల్ మెజారిటీ (272 స్థానాలు) ఉంటే.. ఏకగ్రీవ తీర్మానంతో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోతుంది. ఫలితం వెంటనే వచ్చేస్తుంది. ప్రస్తుతం సభలో ఏ పార్టీకి కూడా సింగిల్గా 272 సీట్ల బలం లేదు. దీంతో పేపర్ స్లిప్పుల ద్వారా ఎంపీలు ఓట్లు వేయడానికి, వాటిని లెక్కించడానికి కొంత సమయం పడుతుంది. చివరకు ఫలితం రిలీజ్ కావడానికి కూడా టైం పడుతుంది.
Also Read : Arvind Kejriwal : కేజ్రీవాల్కు బెయిల్పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
స్పీకర్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలందరికీ త్రీలైన్ విప్ జారీ చేసింది. ఎంపీలంతా తప్పకుండా బుధవారం ఉదయం 11 గంటల నుంచి లోక్సభ సమావేశం ముగిసే వరకు సభలోనే అందుబాటులో ఉండాలని కోరింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ కె.సురేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈయనే ప్రస్తుతం ఇండియా కూటమి తరఫున లోక్సభ స్పీకర్(Lok Sabha Speaker) అభ్యర్థిగానూ పోటీ చేస్తుండటం గమనార్హం.