లోక్సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!
ఇలాంటి ఘటన గతంలో 2004లో జరిగింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా లోక్సభలో హంగామా కారణంగా తన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు.
- Author : Gopichand
Date : 05-02-2026 - 2:25 IST
Published By : Hashtagu Telugu Desk
Lok Sabha: రాష్ట్రపతి పార్లమెంట్ ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత దానిపై చర్చ జరగడం, అనంతరం ప్రధానమంత్రి సమాధానం ఇవ్వడం ఒక ఆనవాయితీ. అయితే లోక్సభలో చోటుచేసుకున్న భారీ గందరగోళం కారణంగా సభ వాయిదా పడింది. దీనివల్ల ప్రధాని మోదీ ప్రసంగం సాధ్యపడలేదు. నిజానికి బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం కోసం సమయం ఖరారైంది. కానీ విపక్షాల నినాదాల మధ్య సభను నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల రచ్చ
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల కారణంగా లోక్సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. దీనివల్ల ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొనలేకపోయారు. ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి అభిభాషణపై ధన్యవాద తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. ఈసారి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే రాష్ట్రపతి ప్రసంగంపై తమ ప్రసంగాలను పూర్తి చేయగలిగారు.
Also Read: అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!
2004 తర్వాత మళ్ళీ ఇప్పుడే..
ఇలాంటి ఘటన గతంలో 2004లో జరిగింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా లోక్సభలో హంగామా కారణంగా తన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు. 2004లో ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. సుమారు 22 ఏళ్ల తర్వాత (2004 తర్వాత) లోక్సభలో ప్రధానమంత్రి ప్రసంగం లేకుండా ధన్యవాద తీర్మానం ఆమోదం పొందడం ఇదే మొదటిసారి.