Jagdeep Dhankhar: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయనున్న జగదీప్ ధన్ఖడ్!
జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడానికి ముందు సోమవారం రాత్రి అనూహ్యంగా రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు.
- By Gopichand Published Date - 06:20 PM, Wed - 23 July 25

Jagdeep Dhankhar: మాన్సూన్ సెషన్ మొదటి రోజు సోమవారం (జులై 21) రాత్రి అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవి నుండి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామా చేశారు. ఇది దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన ఆరోగ్య కారణాలను పేర్కొన్నారు. ధన్ఖడ్ ఇప్పుడు త్వరలో ఉపరాష్ట్రపతి భవనాన్ని ఖాళీ చేయనున్నారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ధన్ఖడ్ ప్రభుత్వ బంగ్లాకు అర్హులని తెలిపారు.
రాజీనామా వివరాలు
జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడానికి ముందు సోమవారం రాత్రి అనూహ్యంగా రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అరగంట తర్వాత ఆయన తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో ప్రజలకు వెల్లడించారు. అదే రోజు నుండి ఆయన ఉపరాష్ట్రపతి భవనాన్ని ఖాళీ చేయడానికి సామాన్ ప్యాక్ చేయడం ప్రారంభించారు. రాష్ట్రపతి మరుసటి రోజు మంగళవారం (జులై 22) ఆయన రాజీనామాను ఆమోదించారు.
Also Read: England: భారత్- ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్.. 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగిన స్టోక్స్ సేన!
ప్రభుత్వ బంగ్లా కేటాయింపు
జగదీప్ ధన్ఖడ్ గత సంవత్సరం ఏప్రిల్లో పార్లమెంట్ భవన్ సమీపంలోని చర్చ్ రోడ్లో కొత్తగా నిర్మించిన ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్కు మారారు. సుమారు 15 నెలల పాటు ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్లో నివసించిన తర్వాత, ఇప్పుడు ఆయన వీపీ హౌస్ను వదిలివేయాల్సి ఉంటుంది. న్యూస్ ఏజెన్సీ పీటీఐ నివేదిక ప్రకారం.. ఒక అధికారి లుటియన్స్ ఢిల్లీ లేదా ఇతర ప్రాంతంలో టైప్-8 బంగ్లాను కేటాయించే ప్రతిపాదన ఉందని తెలిపారు. టైప్-8 బంగ్లా సాధారణంగా సీనియర్ కేంద్ర మంత్రులు లేదా జాతీయ పార్టీల అధ్యక్షులకు కేటాయించబడుతుంది.
ధన్ఖడ్ రాజీనామా వెనుక ఆరోగ్య కారణాలతో పాటు మరిన్ని లోతైన కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అనేక విపక్ష పార్టీలు ఆయనను కలవడానికి సమయం కోరాయి. కానీ వారికి సమయం దొరకలేదు. రాజీనామా చేసినప్పటి నుండి ఆయన ఏ రాజకీయ పార్టీలతోనూ సమావేశం కాలేదు. జగదీప్ ధన్ఖడ్పై పక్షపాత వైఖరిని అవలంబించారని ఆరోపణలు చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకురావడానికి ప్రయత్నించిన అనేక విపక్ష సభ్యులు ఇప్పుడు ఆయనను ప్రశంసిస్తున్నారు.