Jan Suraaj : కొత్త పార్టీకి నేను నాయకుడిని కాదు..అక్టోబర్ 2న ప్రకటిస్తా : ప్రశాంత్ కిశోర్
Jan Suraaj : ఆ పార్టీకి నేనెప్పుడూ నాయకుడిని కాదు. అలా ఉండాలనీ నేనెప్పుడూ అనుకోలేదు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయమిది'' అని ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
- Author : Latha Suma
Date : 29-09-2024 - 5:55 IST
Published By : Hashtagu Telugu Desk
Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. పార్టీ పేరు, నాయకత్వం సహా ఇతర వివరాలను అక్టోబర్ 2న ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే, పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో ఉండదన్నారు. రెండేళ్ల క్రితం తాను చేపట్టిన జన్ సురాజ్ యాత్రనే రాజకీయ పార్టీగా మలచనున్నట్లు ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే బిహార్ శాసనసభ ఎన్నికల్లోనే పార్టీ తరఫున పోటీ చేస్తామని చెప్పారు.
Read Also: Arvind Kejriwal: హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం: కేజ్రీవాల్
”ఆ పార్టీకి నేనెప్పుడూ నాయకుడిని కాదు. అలా ఉండాలనీ నేనెప్పుడూ అనుకోలేదు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయమిది” అని ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అక్టోబర్ 2, 2022న జన్ సురాజ్ పేరుతో ప్రారంభించిన యాత్ర రెండేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. కొత్త పార్టీ నాయకత్వ వివరాలను అక్టోబర్ 2న వెల్లడిస్తానని తెలిపారు.
మూడు ప్రధాన ఉద్దేశాలతోనే జన్ సురాజ్ యాత్ర చేపట్టినట్లు ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు వారి చిన్నారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, తప్పుదోవ పట్టించే నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఓట్లు వేయకుండా అవగాహన కల్పించడంతోపాటు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పర్యటించాలని ఈ యాత్ర చేపట్టానన్నారు. ఇప్పటివరకు 60శాతం యాత్ర పూర్తయిందని, తదుపరి కొనసాగుతుందన్నారు. అయితే, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ యాత్ర కొనసాగుతుందన్న ఆయన.. పార్టీకి నాయకత్వ బాధ్యతలు మాత్రం తాను వహించడం లేదన్నారు.