Stress: ప్రతిరోజూ ఈ ఆసనం వేస్తే… ఎంతటి ఒత్తిడి అయినా మాయం అవుతుంది..!!
- Author : Vamsi Chowdary Korata
Date : 15-06-2026 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
నేటి రోజుల్లో చాలా మంది అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్కడికైనా ప్రతి వ్యక్తికి ఒత్తిడి అనేది ఎదురవుతూనే ఉంది. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తోంది. దీంతో డిప్రెషన్కు గురై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అయితే ఈ ఆసనాన్ని రోజూ వేస్తే.. ఎంతటి ఒత్తిడి అయినా సరే ఇట్టే మటుమాయం అవ్వడమే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరి ఆ ఆసనం ఏమిటి? దాన్ని ఎలా వేయాలి? తెలుసుకుందాం.
అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలను తగ్గించుకోవాలంటే ఈ సమకోణాసనం చక్కగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వేయాలో తెలుసుకుందాం. నేలపై నిలబడి కాళ్లను దగ్గరకు ఉంచాలి. తరువాత ముందుకు నెమ్మదిగా వంగాలి. ఇలా వంగినప్పుడు శరీర భంగిమ ఆంగ్ల అక్షరం L ఆకారంలో ఉండాలి. నడుం దగ్గర వంగి ముందుకు శరీరాన్ని నిటారుగా వంచాలి. తరువాత రెండు చేతులను ముందుకు చాపాలి. వాటి మధ్య కాస్త దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖాన్ని కిందకు ఉంచి నేలను చూస్తుండాలి. ఇలా ఈ భంగిమలో మీకు వీలైనంత సేపు ఉండాలి.
ఈ సమకోణాసనాన్ని రోజూ కనీసం 10 నిమిషాల పాటు చేయాలి. దీంతో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు మనసుకి హాయిగా ఉంటుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయటపడవచ్చు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలోని కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. కండరాల నొప్పులు తగ్గడంతో పాటు వెన్నెముక దృఢంగా మారుతుంది. రోజూ కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చునే వారికి ఈ ఆసనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు మెడ నొప్పి కూడా తగ్గుతుంది. దీన్ని రోజుకు కనీసం 10 సార్లు లేదా 10 నిమిషాల పాటు చేస్తే సరైన ఫలితం లభిస్తుంది.
ముఖ్య గమనిక:
మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, కాళ్లలో సమస్యలు ఉన్నవారు.. ఈ ఆసనాన్ని వేయకూడదు.

Practicing this asana every day makes even the most intense stress vanish!