Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం
- Author : Vamsi Chowdary Korata
Date : 20-04-2026 - 10:14 IST
Published By : Hashtagu Telugu Desk
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం సోమవారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే అప్పన్న నిజరూప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో సింహగిరికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి.
సోమవారం తెల్లవారుజామున ఆలయ అనువంశిక ధర్మకర్త పి. అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు స్వామివారికి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ తదితర ప్రముఖులు, ఉన్నతాధికారులు స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో వారిని నియంత్రించేందుకు హోంమంత్రి అనిత స్వయంగా రంగంలోకి దిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం, జిల్లా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భక్తుల కోసం తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. రాత్రి వరకు నిజరూప దర్శనం కొనసాగి, ఆ తర్వాత స్వామివారికి మళ్లీ చందనపు పూత వేయనున్నారు.