Kartik Purnima : నవంబర్ 1 పవిత్రమైన దేవుత్తని ఏకాదశి.. కార్తీక మాసం!
- By Vamsi Chowdary Korata Published Date - 10:45 AM, Sat - 1 November 25
నవంబర్ 1వ తేదీ దేవుత్తని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు. ఈరోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని విశ్వాసం. ఈరోజు నుంచే శుభకార్యాలు ప్రారంభమవుతాయట. ఇందుకు ఆరంభ సూచకంగా మరుసటి రోజు నవంబర్ 2న తులసి వివాహం చేస్తారు. చాలా మంది ఉపవాస దీక్ష కూడా ఆచరిస్తారు. ఈరోజున శ్రీమహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే విశేషమైన పుణ్యఫలం ఉంటుందని విశ్వాసం. ఈ నేపథ్యంలో దేవుత్తని ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం..
హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో ఏకాదశి , ద్వాదశి, సోమవారాలు, పౌర్ణమి రోజులు ఎంతో విశేషమైనవిగా పండితులు భావిస్తారు. అయితే.. నవంబర్ 1న దేవుత్తని ఏకాదశి. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అంటారు. వైదిక పంచాంగం ప్రకారం.. కార్తీక శుక్ల ఏకాదశి తిథి 2025 నవంబర్ 1 సూర్యోదయ సమయం నుంచి ప్రారంభమై.. నవంబర్ 2వ తేదీ ఉదయం 07.31 గంటల వరకూ ఉంటుందని పండితులు చెబుతున్నారు.
కాబట్టి నవంబర్ 1వ తేదీన దేవుత్తని ఏకాదశిని పాటిస్తారు. నవంబర్ 1న దేవుత్తని ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసం శుక్ల ఏకాదశి తిథి శనివారం నవంబర్ 1వ తేదీ ఉపవాసం ఆచరించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల సర్వపాపాలు నశిస్తాయని చెబుతారు. ముఖ్యంగా ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే వేయి అశ్వమేధ యాగాలు, వంద రాజసూయ యాగాలు చేసినంత ఫలితం కలుగుతుందని పెద్దల మాట.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆషాఢ శుద్ధ ఏకాదశికి శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోని వెళ్లినప్పుడు ఆగిన శుభకార్యాలు.. చాతుర్మాస్య వ్రత దీక్ష ముగిసిన అనంతరం కార్తీక శుక్ల ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనడంతో శుభకార్యాలు సైతం ప్రారంభమవుతాయి. కార్తీక శుద్ద ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును మేల్కొలిపేందుకు బ్రహ్మాది దేవతలతో పాటు, మునులు, మహర్షులు విష్ణులోకానికి వెళతారట. వీళ్లంతా మృదంగ వాయిద్యాలతో కీర్తనలు పాడుతూ, భజనలు చేసుకుంటూ, నాట్యం చేస్తూ వెళ్లి శ్రీమహావిష్ణువుని మేల్కొలుపుతారట. ఆ తర్వాత పరమేశ్వరుడు, విష్ణుమూర్తిని పూజించి హారతి ఇవ్వగా.. బ్రహ్మ వేదాలు పఠించాడని పురాణోక్తి. అప్పటి నుంచే పూజా కార్యక్రమాల్లో హారతి ఇచ్చే సంప్రదానం మొదలైందని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఈ దేవుత్తని ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించడం వల్ల సిరిసంపదలు, సుఖశాంతులు లభిస్తాయని విశ్వాసం. ఆ మరుసటి అంటే ద్వాదశి రోజున దేవాలయాల్లో తులసి వివాహాన్ని ఘనంగా జరిపిస్తారు. అంతే కాకుండా ఉత్థాన ఏకాదశి రోజున చేసే దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ ఏకాదశి రోజున దానధర్మాలు, పుణ్యకార్యాలు చేసేవారి ఇంట్లో ధన ధాన్యాలకు, సిరిసంపదలకు, సుఖసంతోషాలకు, ఐశ్వరానికి లోటుండదని ప్రగాఢ విశ్వాసం. అంతే కాకుండా కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల కోరికలు నెరవేరుతాయని కూడా నమ్మకం. ఇంతటి పవిత్రమైన రోజున బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి పవిత్ర స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుకోవాలి. శ్రీహహావిష్ణువును స్మరించుకుంటూ విగ్రహం లేదా చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి పూజ చేయాలి. అనంతరం విష్ణు సహస్రనామం పఠించాలి.