ఉదయ్పుర్ బయల్దేరిన విజయ్, రష్మిక
- Author : Vamsi Chowdary Korata
Date : 23-02-2026 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
ViRosh wedding టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న అంగరంగ వైభవంగా జరగనుంది. ఐటీసీ మొమెంటోస్ రిసార్ట్ లో వివాహ ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయ్-రష్మికలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే రాజస్థాన్లోని ఉదయ్పూర్ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచే అతిథుల రాకతో అక్కడ సందడి మొదలు కానున్నట్లు సమాచారం. రేపు (ఫిబ్రవరి 24) ఉదయం హల్దీ వేడుకతో అధికారికంగా ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ జంట ఫిబ్రవరి 22న సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అభిమానులు ప్రేమతో పెట్టిన “విరోష్” పేరునే తమ వివాహ వేడుకకు “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అని నామకరణం చేశారు.
విమానాశ్రయంలో విజయ్, రష్మిక..
ఈ రోజు ఉదయం ఈ జంట హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. విజయ్ స్టైలిష్ లెదర్ జాకెట్, కొత్త హెయిర్స్టైల్ మరియు మెలితిప్పిన మీసంతో కనిపించగా, రష్మిక గ్రే బ్లేజర్ సూట్లో మెరిసిపోయారు. వీరితో పాటు ఆనంద్ దేవరకొండ, ఇతర కుటుంబ సభ్యులు ఉదయ్పూర్కు బయలుదేరారు. అక్కడి ఐటీసీ మొమెంటోస్ రిసార్ట్లో ఫిబ్రవరి 26న వివాహం జరగనుంది. ఈ వేడుక కోసం అంతర్జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి సినీ పరిశ్రమ నుంచి ఎవరికీ ఆహ్వానాలు అందలేదని, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు (సుమారు 200 మంది) మాత్రమే హాజరవుతున్నారని సమాచారం.
వేడుకల షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 24న హల్దీ, 25న సంగీత్ మరియు మెహందీ కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల 26న వివాహం తర్వాత మార్చి 4న హైదరాబాద్లో సినీ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది.