దుబాయ్లో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా సోనూ సూద్
- Author : Vamsi Chowdary Korata
Date : 05-03-2026 - 1:02 IST
Published By : Hashtagu Telugu Desk
సహాయం కావాల్సిన వారు ఎలాంటి సందేహం లేకుండా తనను సంప్రదించాలని సోనూ సూద్ కోరారు. తన ఇన్స్టాగ్రామ్కు సందేశం పంపిస్తే, తన బృందం వెంటనే స్పందించి సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సహాయానికి ఎలాంటి షరతులు వర్తించవని, ఏ దేశస్థులైనా సరే కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడటమే మన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. “ఇలాంటి సంక్షోభ సమయంలో మనుషులుగా ఒకరికొకరం అండగా ఉండటం చాలా ముఖ్యం” అని సోనూ సూద్ తన సందేశంలో తెలిపారు.
సోనూ సూద్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇది మొదటిసారి కాదు. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ముఖ్యంగా లాక్డౌన్ విధించినప్పుడు ఆయన చేసిన సేవలు అజరామరం. పట్టణాలు, నగరాల్లో చిక్కుకుపోయిన లక్షలాది మంది వలస కార్మికులను వారి సొంత ఊళ్లకు పంపేందుకు ప్రత్యేక బస్సులు, రైళ్లు, చివరికి విమానాలు కూడా ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను, ఇతర భారతీయులను స్వదేశానికి రప్పించారు. ఆయన సేవలకు దేశవ్యాప్తంగా ప్రజలు నీరాజనాలు పలికారు. అప్పటి నుంచి ఆయన్ను అభిమానులు, ప్రజలు ‘రియల్ హీరో’గా పిలుచుకుంటున్నారు.
ఇప్పుడు మరోసారి విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడానికి ముందుకు రావడంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సంక్షోభ సమయాల్లో మానవత్వానికి అసలైన చిరునామా సోనూ సూద్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆయన ప్రకటనతో ధైర్యం పొందిన పలువురు ప్రయాణికులు ఇప్పటికే సహాయం కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కష్టకాలంలో ఆయన అందిస్తున్న భరోసా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.