Theaters Shutdown: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్.. తాజా అప్డేట్ ఇదే!
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం వాయిదా పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఈ విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర చర్చలు జరిగాయి.
- By Gopichand Published Date - 06:18 PM, Wed - 21 May 25

Theaters Shutdown: జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు (Theaters Shutdown) మూసివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం వాయిదా పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఈ విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర చర్చలు జరిగాయి. ఉదయం 11 గంటలకు డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం జరిగింది. దీనిలో 40 మంది డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్మాతలతో మరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మెజారిటీ సభ్యులు సమ్మెకు వ్యతిరేకంగా, థియేటర్లు మూసివేయకుండా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని నిర్ణయించారు.
గతంలో క్యూబ్ సమస్యలు, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ విషయాల్లో థియేటర్ల మూసివేత, షూటింగ్ల నిలిపివేత వంటి చర్యలు సత్ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో,ఈసారి థియేటర్లను మూతపడకుండా, సినిమాలను నడుపుతూనే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సూచించారు. పైరసీ, ఐపీఎల్, ఓటీటీ ప్లాట్ఫారమ్ల ప్రభావంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గింది. మే 30 నుంచి వరుస సినిమాల విడుదల ఉండటంతో థియేటర్ల మూసివేత మరింత ఇబ్బందులకు దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల థియేటర్ల మూసివేత నిర్ణయాన్ని పునరాలోచించి, తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని ఎగ్జిబిటర్లకు సూచించారు.
ఈ చర్చలు తెలుగు సినీ పరిశ్రమలో సమతుల్య విధానం అవసరమని తెలియజేస్తున్నాయి. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, పరిశ్రమ బలోపేతం కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని నిర్ణయం జరిగింది. థియేటర్లు నడుస్తూ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడం ద్వారా పరిశ్రమకు స్థిరత్వం, వృద్ధి సాధ్యమని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు భావిస్తున్నారు.