షాకింగ్ రిపోర్ట్.. భారత్లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!
దేశంలోని టాప్ 1 శాతం జనాభా వద్ద 40 శాతం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. మరోవైపు దిగువన ఉన్న 50 శాతం మంది ప్రజలు మొత్తం ఆదాయంలో కేవలం 15 శాతం వాటాపైనే ఆధారపడుతున్నారు.
- Author : Gopi
Date : 06-04-2026 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
Richest Indians: దేశంలో ఆస్తుల పంపిణీకి సంబంధించి ఒక కొత్త నివేదిక తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ప్రకారం.. భారతదేశంలోని కేవలం 1,688 మంది సంపన్నుల వద్ద సుమారు 166 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఇది దేశ మొత్తం జీడీపీలో దాదాపు 50 శాతం. ఈ నివేదికలో ఇంకా ఏముందో చూద్దాం.
దేశంలో ఆర్థిక అసమానతలపై ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు కొంతవరకు వలసపాలన నాటి అసమానతలను గుర్తుకు తెస్తున్నాయని నివేదిక సూచించింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కొన్ని సూచనలు కూడా నివేదికలో పేర్కొన్నారు.
దేశంలో ఆస్తుల పంపిణీపై విడుదలైన ‘Wealth Tracker India 2026’ నివేదికలో భారీ వ్యత్యాసం వెలుగుచూసింది. దీనిని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ‘Tax the Top’ ప్రచారంతో కలిపి ఏప్రిల్ 1, 2026న విడుదల చేసింది. 2019 నుండి 2025 మధ్య కాలంలో ఎగువ తరగతి వారి ఆస్తులు వేగంగా పెరిగాయని, అదే సమయంలో దిగువ తరగతి వారి వాటాలో పెద్దగా మార్పు రాలేదని నివేదిక పేర్కొంది.
గణాంకాల ప్రకారం.. దేశంలోని టాప్ 1 శాతం జనాభా వద్ద 40 శాతం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. మరోవైపు దిగువన ఉన్న 50 శాతం మంది ప్రజలు మొత్తం ఆదాయంలో కేవలం 15 శాతం వాటాపైనే ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో 1,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తి ఉన్నవారి సంఖ్య 77 శాతం పెరిగింది. వారి మొత్తం ఆస్తి 31 లక్షల కోట్ల రూపాయల నుండి 88 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇది సుమారు 227 శాతం పెరుగుదలను చూపిస్తుంది.
Also Read: ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!
ధనికులు మరింత ధనికులుగా
గడిచిన కొన్నేళ్లలో దేశంలోని అత్యంత ధనిక కుటుంబాల సంపదలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్, సునీల్ మిట్టల్, శివ్ నాడార్ వంటి ప్రముఖుల మొత్తం ఆస్తి 2019 నుండి 2025 మధ్య కాలంలో దాదాపు 400 శాతం పెరిగింది. ఈ కాలంలో ముకేశ్ అంబానీ ఆస్తి సుమారు 153 శాతం పెరగ్గా, గౌతమ్ అదానీ సంపద 625 శాతం పెరిగింది. ఈ ఐదు కుటుంబాల మొత్తం ఆస్తి 2019లో దాదాపు 6.68 లక్షల కోట్ల రూపాయలు ఉండగా, అది 2025 నాటికి సుమారు 26.54 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.
ధనికులపై పన్నుతో పెరగనున్న ప్రభుత్వ ఆదాయం
అత్యంత సంపన్నులపై ప్రోగ్రెసివ్ వెల్త్ టాక్స్ విధించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ప్రకారం.. అత్యంత ధనికమైన 1,688 కుటుంబాలపై 2 నుండి 6 శాతం వరకు పన్ను, దాంతో పాటు మూడవ వంతు వారసత్వ పన్ను విధిస్తే ప్రతి ఏటా సుమారు 10.63 లక్షల కోట్ల రూపాయలను సమీకరించవచ్చని నివేదిక పేర్కొంది. ఈ నిధులను సామాజిక పథకాల కోసం ఉపయోగించవచ్చు. దీనివల్ల గతంలో కంటే పేద కుటుంబాలకు ఎక్కువ సహాయం అందుతుంది. రెండు వర్గాల మధ్య ఉన్న అసమానతలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.