లోక్సభలో నాటుకోడి ధరలపై వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి ఆవేదన
- Author : Vamsi Chowdary Korata
Date : 04-02-2026 - 10:53 IST
Published By : Hashtagu Telugu Desk
Avinash Reddy పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో చికెన్ ధరల అంశం చర్చకు వచ్చింది. కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి రాష్ట్రంలో చికెన్ ధరల అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో నాటుకోడి ధరలు మటన్ కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. అసలు ఈ ధరలు పెరిగినట్లు ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. పౌల్ట్రీ రైతుల కోసం కేంద్రం రోగ నియంత్రణ, బయో సెక్యూరిటీ, బీమా చర్యలు తీసుకుంటుందా అని అడిగారు. ఒకవేళ కేంద్రం చర్యలు తీసుకోకపోతే కారణాలు ఏంటి అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.
అవినాష్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి రాజీవ్రంజన్సింగ్ సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నాటుకోడి ధరలపై క్లారిటీ ఇచ్చారు.. నాటుకోడి మాంసం ధర రూ.500 ఉందని.. మటన్ ధర రూ.900 వరకు ఉందన్నారు. నాటు కోడి ధర కంటే మటన్ ధర తక్కువగానే ఉంది అన్నారు. తమకు ఏపీ పశుసంవర్ధకశాఖ నుంచి సమాచారం వచ్చినట్లు తెలిపారు.బర్డ్ ఫ్లూ సోకి నష్టం జరిగితే పరిహారంలో భాగంగా 50శాతం నిధులు కేంద్రం అందజేస్తుందని కేందమంత్రి తెలిపారు. కోళ్లకు వచ్చే వ్యాధులను అరికట్టడానకి వ్యాక్సినేషన్ సహాయం అందిస్తున్నామన్నారు. ఎంపీ అడిగిన మిగిలిన ప్రశ్నలు ఉత్పన్నం కావన్నారు.
అమరావతిలో భూసేకరణ అంశం కూడా లోక్సభలో ప్రస్తావనకు వచ్చింది. అమరావతిలో భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. భూ సమీకరణకు సంబంధించి రైతులు చేసే ఫిర్యాదులపై కేంద్రం సమీక్ష చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో రూ.2,416.92 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి (పీఎం) మత్స్యసంపద యోజన కింద ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. కేంద్రం వాటారూ.569.86 కోట్లలో రూ.482.55 కోట్లు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, అనకాపల్లి, బాపట్ల, నెల్లూరులో ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. అలాగే రూ.288.80 కోట్లతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేసిటన్లు కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు.