Sirajs Terror Links: రాజాసింగ్ వీడియోకు సిరాజ్ కౌంటర్.. సిరాజ్కు ఓ అధికారి ప్రోత్సాహం.. ఎవరతడు ?
ఈమేరకు సిరాజ్కు(Sirajs Terror Links) అతడు ఒక మెసేజ్ను పంపాడట.
- Author : Pasha
Date : 25-05-2025 - 12:52 IST
Published By : Hashtagu Telugu Desk
Sirajs Terror Links: విజయనగరానికి చెందిన సిరాజ్కు ఉన్న ఉగ్ర లింకుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సిరాజ్, సికింద్రాబాద్కు చెందిన అతడి స్నేహితుడు సమీర్లను విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో ప్రశ్నిస్తున్నారు. రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు వారిని వివిధ కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. శనివారం రోజు సిరాజ్, సమీర్లను 7 గంటల పాటు విచారించారు.
Also Read :Mann Ki Baat : ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య మాత్రమే కాదు.. ధైర్యం, దేశభక్తి కూడా : ప్రధాని మోడీ
రాజాసింగ్పై సిరాజ్ కామెంట్స్.. సిరాజ్ను రెచ్చగొట్టిన ఓ వ్యక్తి
ఈ విచారణ జరిపే క్రమంలో మరో కొత్త విషయం బయటపడింది. అదేమిటంటే.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియోకు గతంలో సిరాజ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయాన్ని అప్పట్లో ఓ వ్యక్తి గుర్తించి, సిరాజ్ను ప్రశంసించాడట. ఈమేరకు సిరాజ్కు(Sirajs Terror Links) అతడు ఒక మెసేజ్ను పంపాడట. ఆ తర్వాత సిరాజ్కు, సదరు వ్యక్తికి మధ్య కొన్ని రోజుల పాటు ఛాటింగ్ కంటిన్యూ అయిందట. నమ్మకం కుదిరిన తర్వాత సదరు వ్యక్తి సిరాజ్కు తన వ్యక్తి గత వివరాలను తెలియజేశాడు. ఆ వ్యక్తి తనను విశాఖపట్నానికే చెందిన ఒక రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. సదరు వ్యక్తి ఓ వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్ను రెచ్చగొట్టినట్లు తేలింది. ప్రస్తుతం సిరాజ్, సమీర్ల సోషల్ మీడియా ఖాతాలు, విదేశీ ఇంటర్నెట్ కాల్స్ను కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎవరెవరికి సిరాజ్, సమీర్లు కాల్స్ చేశారు ? ఏమేం మాట్లాడారు ? అనే దానిపై పోలీసులు వారిని ఆరా తీస్తున్నారు.
Also Read :Dogs Vs Cancer : కుక్కలు క్యాన్సర్ను కూడా పసిగడతాయ్.. ఎలాగో తెలుసా ?
సిగ్నల్ యాప్లో గ్రూపు.. ఆ ఆరుగురు
ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్, సమీర్లు మరో నలుగురితో కలిసి సిగ్నల్ యాప్లో ఒక రహస్య గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా కలిసి అల్హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే సంస్థను స్థాపించినట్టు పోలీసులు గుర్తించారు. సిరాజ్, సమీర్ మినహా మిగతా నలుగురు యువకులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారని తేలింది.రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలను పోలీసులు ప్రస్తావించారు. ఈ ఆరుగురు మూడు రోజుల పాటు హైదరాబాద్లో రహస్యంగా సమావేశమైనట్లు వెల్లడైంది. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ హ్యాండ్లర్లు ఇచ్చే ఆదేశాలను ఎలా అమలు చేయాలనే దానిపై వీరు కసరత్తు చేశారట. సమీర్, సిరాజ్లు ఆన్లైన్లో పేలుడు పదార్థాలను ఆర్డర్ చేయడంతో పాటు, బాంబుల తయారీ విధానం గురించి యూట్యూబ్లో తెలుసుకున్నట్లు తేలింది.