Kakinada Port : సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
దీంతో ఆయన ఈరోజు విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయం లో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు.
- By Latha Suma Published Date - 01:16 PM, Wed - 12 March 25

Kakinada Port : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఐడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో ఆయన సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఇదే కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఏపీ సీఐడీ అధికారులు రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కి నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఆయన ఈరోజు విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయం లో విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు. అప్పుడు వాటాల్లో పాత్రధారులు, సూత్రధారులపై విజయసాయి రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
Read Also: Jio Vs Airtel : స్టార్ లింక్తో జియో, ఎయిర్టెల్ డీల్.. ఎవరికి లాభం ?
ఈ కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడు(ఏ2) కాగా, జగన్ బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డి ఏ1గా ఉన్నారు. కేఎస్పీఎల్, కేసెజ్ల్లో వాటాలు లాగేసుకున్న వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేసింది. రెండు నెలల కిందట సాయిరెడ్డిని ఈడీ విచారించింది. ఇదే వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇవ్వడంతో విజయసాయిరెడ్డి ఈరోజు హాజరయ్యారు.
జగన్ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (కేఎస్పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)ల్లో రూ.3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ ఇటీవల నోటీసులిచ్చింది. ఇక, సీఐడీ కార్యాలయంలోకి విజయసాయి రెడ్డి మినహా ఇంకా ఎవరినీ అధికారులు లోపలకు అనుమతించలేదు. న్యాయవాదులకు కూడా అనుమతి లేదన్నారు. విజయసాయి రెడ్డి చెప్పే సమాధానాలపై వైసీపీ కీలక నేతల గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. విచారణలో ఏం చెబుతారోననే వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
Read Also: IPL 2025: ఐపీఎల్ 2025 తర్వాత ఈ స్టార్ ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకోనున్నారా?