Jnaneswari Missing: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్
- Author : Vamsi Chowdary Korata
Date : 08-07-2026 - 11:33 IST
Published By : Hashtagu Telugu Desk
తుని మండలం సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో కాపలాగా పనిచేస్తున్న సుంకర గణేశ్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి, జూన్ 6న అదృశ్యమైన విషయం తెలిసిందే. తల్లి వంట చేస్తున్న సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కతో కలిసి కొండ వైపు వెళ్లినట్లు ఒక గ్రామస్థుడు చూసినా, ఆ తర్వాత కుక్క మాత్రమే ఒంటరిగా తిరిగి వచ్చింది.
మంగళవారం తునిలో డీఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడుతూ, పాప ఆచూకీయే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. సమాచారం అందిస్తే తామే స్వయంగా వచ్చి పాపను తీసుకుంటామని తెలిపారు. చుట్టుపక్కల తోటలు, కొండ ప్రాంతాల్లో గాలించినా జంతువుల దాడి ఆనవాళ్లు లభించలేదని, అందుకే కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. సెల్ఫోన్లు వాడని వ్యక్తులపై దృష్టి సారించినట్లు చెప్పారు.
సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ సిబ్బంది, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పాప ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష రివార్డు ప్రకటించారు. కేసు దర్యాప్తులో భాగంగా పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చినా, అది కూడా ఆ తర్వాత మృతి చెందింది. నెల రోజులు గడిచినా పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.