Tirupati Laddu: మొదట కిలో నెయ్యి రూ. 428కి ఇవ్వలేనన్న డెయిరీ..తర్వాత రూ. 320కి ఎలా ఇచ్చింది?: ఆనం
తాజాగా ఈ విషయంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. అంతేకాకుండా వైసీపీకి, జగన్కి పలు ప్రశ్నలు సంధించారు. 2023లో రూ.496 ఉన్న కేజీ నెయ్యి రేటు.. 2024లో రూ.320 ఎలా అయ్యింది?
- By Gopichand Published Date - 02:34 PM, Thu - 3 October 24

Tirupati Laddu: ఏపీలో తిరుపతి లడ్డూ వివాదం (Tirupati Laddu) హాట్ హాట్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఉంది వ్యవహారం. గత జగన్ ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డూ చేయడానికి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలిసిందే. పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టగా.. చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయమై దర్యాప్తు చేయటానికి సిట్ను ఏర్పాటు చేసింది. చంద్రబాబు కేవలం జగన్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా నిజనిజాలు తేల్చాలని ఏపీ ప్రభుత్వాన్ని, బెంచ్ను కోరింది.
తాజాగా ఈ విషయంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. అంతేకాకుండా వైసీపీకి, జగన్కి పలు ప్రశ్నలు సంధించారు. 2023లో రూ.496 ఉన్న కేజీ నెయ్యి రేటు.. 2024లో రూ.320 ఎలా అయ్యింది? ఒక్క సంవత్సరంలో నెయ్యి రేటు 55 శాతం తగ్గుతుందా? తక్కువ రేటుకు నాణ్యమైన నెయ్యి సరఫరా ఎలా సాధ్యం? వైవీ సుబ్బారెడ్డి హయాంలో కిలో నెయ్యి రూ.496కి కొన్నారు. భూమన కరుణాకర్రెడ్డి హయాంలో కిలో నెయ్యి రూ.320కి కొన్నారు. తిరుమల నెయ్యి విషయంలో ఎన్నో అక్రమాలు జరిగాయని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.
Also Read: Lava Agni 3 5G: లావా నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
వైష్ణవి డైరీ నుంచి బయలుదేరిన నెయ్యి ట్రక్ తిరుమలకు వెళ్లకుండా దిండిగల్ లోని AR ఫుడ్స్ వరకూ వెళ్లిందని ఆధారాలతో సహా బయటపెట్టారు. AR ఫుడ్స్ కి వైష్ణవి డైరీ సప్లయర్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రీమియర్ ఆగ్రో చెన్నై, పరాగ్ మిల్క్ ముంబై, త్రిపారం యూపీ, ఇలా అన్ని కంపెనీలతో కలిసి, పథకం ప్రకారం తిరుమలకు కల్తీ నెయ్యిని సరఫరా చేశారని తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు.