గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ
- Author : Vamsi Chowdary Korata
Date : 18-03-2026 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ నివాసంలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
కఠారి ఈశ్వర్ వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులో ఉంటుండగా, ఆయన భార్య మధురిమ రెండు రోజుల క్రితం వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వెళ్లారు. ఈ ఉదయం ఆమె తిరిగి గుడివాడలోని ఇంటికి చేరుకోగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని ఆమె గమనించారు. లోపలికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో, ఇంట్లో దొంగతనం జరిగినట్టు ఆమె గుర్తించారు.
ఈ దొంగతనంలో సుమారు 10 కిలోల వెండి వస్తువులు, ఖరీదైన పూజా సామగ్రి అపహరణకు గురైనట్లు గుర్తించారు. మధురిమ ఫిర్యాదు మేరకు గుడివాడ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తోంది. పక్కా ప్లాన్తోనే ఈ చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.