నరసాపురం లేసుల కళా వైభవం.. చంద్రబాబు విజన్, మోదీ ప్రశంసల జల్లు!
మహిళలు తరతరాలుగా ఈ అరుదైన హస్తకళను కాపాడుకుంటూ రావడం అభినందనీయమని, నేడు ఆధునిక హంగులతో ఇది మరింత ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ కొనియాడారు.
- Author : Gopichand
Date : 29-12-2025 - 5:57 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Vision: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది సుందరమైన లేసు అల్లికలు. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ హస్తకళకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మళ్లీ పూర్వ వైభవం లభిస్తోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో నరసాపురం లేసుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఈ అరుదైన కళ మరోసారి వార్తల్లో నిలిచింది.
ఏమిటి దీని ప్రత్యేకత?
నరసాపురం లేసుల అల్లిక అనేది ఒక అద్భుతమైన సృజనాత్మక ప్రక్రియ. అత్యంత నాణ్యమైన పత్తి దారాలతో, ప్రత్యేకమైన సూదులను ఉపయోగించి మహిళలు తమ చేతులతో వీటిని అల్లుతారు. డోలీలు, దిండు కవర్లు, బెడ్స్ప్రెడ్లు, టేబుల్ రన్నర్ల నుంచి నేటి తరం మెచ్చే పర్సులు, మొబైల్ కవర్లు, స్టోల్స్ వరకు ఎన్నో కళాఖండాలు ఇక్కడ తయారవుతాయి. ఏపీ ప్రభుత్వ చొరవతో ఈ కళకు ఇటీవల జీఐ ట్యాగ్ లభించింది. ఇది నరసాపురం లేసుల నాణ్యతకు, ప్రత్యేకతకు ఒక అంతర్జాతీయ సర్టిఫికేట్గా మారింది. 19వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైన ఈ కళ, వేలాది మంది పేద మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది.
Also Read: 2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !
25 ఏళ్ల క్రితమే చంద్రబాబు బ్రాండింగ్
నరసాపురం లేసుల గొప్పతనాన్ని రెండున్నర దశాబ్దాల క్రితమే గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దీనికి ఒక వ్యవస్థీకృత రూపాన్ని ఇచ్చారు. 2000వ సంవత్సరంలో నరసాపురంలో దేశంలోనే మొట్టమొదటి లేస్ పార్క్ను ఏర్పాటు చేశారు. ‘అంబేద్కర్ హస్త వికాస్ యోజన’ కింద డీఆర్డీఏ సహకారంతో ఈ పార్క్ను అభివృద్ధి చేయడం వల్ల, మహిళా కళాకారులకు నేరుగా మార్కెటింగ్ చేసుకునే సౌకర్యం కలిగింది. ఆనాడు వేసిన పునాది నేడు ఈ కళ ప్రపంచ దేశాలకు (US, UK, ఫ్రాన్స్) ఎగుమతి అయ్యే స్థాయికి చేరింది.
ప్రధాని మోదీ ప్రశంసలు – లోకేష్ కృతజ్ఞతలు
మహిళలు తరతరాలుగా ఈ అరుదైన హస్తకళను కాపాడుకుంటూ రావడం అభినందనీయమని, నేడు ఆధునిక హంగులతో ఇది మరింత ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ కొనియాడారు. నరసాపురం లేసులకు జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చినందుకు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నరసాపురం లేసులు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు తెలుగు వారి కళా నైపుణ్యానికి, మహిళా శక్తికి నిదర్శనం.