ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి.. 28 మంది మృతి, 100 మందికిపైగా గల్లంతు!
అంతేకాకుండా అమెరికా సైన్యం ఇకపై కేవలం తీరాలకు లేదా సముద్రానికే పరిమితం కాదని, ఇరాన్ సైనిక నిర్మాణం, నాయకత్వం, క్షిపణి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి ఇరాన్ భూభాగంలోని నేల స్థావరాలపై కూడా దాడులు చేస్తామని హెగ్సెత్ హెచ్చరించారు.
- Author : Gopichand
Date : 04-03-2026 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
Iranian Warship: మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికాకు చెందిన జలాంతర్గామి శ్రీలంక సమీపంలో ఇరాన్ నౌకాదళానికి చెందిన ‘డేనా’ ఫ్రిగేట్పై దాడి చేసి దానిని ముంచేసింది. ఈ నౌకలో ఉన్న 32 మంది తీవ్రంగా గాయపడిన నావికులను రక్షించారు. భారత్లో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ- ‘మిలన్ 2026’ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని ఈ నౌక తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
భారత నౌకాదళం బంగాళాఖాతంలో ‘మిలన్ 2026’ విన్యాసాలను నిర్వహించింది. ఇందులో డజన్ల కొద్దీ దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి. ఈ ఘటనను ఇరాన్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ అబోల్ఫాజ్ల్ షెకార్చి ధృవీకరించారు. ఈ దాడికి అమెరికా జలాంతర్గామే కారణమని ఆయన ఆరోపించారు.
Also Read: టీ20 వరల్డ్ కప్.. ఫైనల్కు చేరిన తొలి జట్టు ఇదే!
అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ మాట్లాడుతూ.. శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా జలాంతర్గామి ఇరాన్ యుద్ధనౌక ‘IRIS డేనా’ను టోర్పెడోతో లక్ష్యంగా చేసుకుని ముంచేసిందని ధృవీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు నౌకను టోర్పెడోతో ముంచేయడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. ఈ నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉన్నారు. శ్రీలంక నౌకాదళం ఇప్పటివరకు 32 మందిని రక్షించగా, 28 మృతదేహాలను వెలికితీసింది. 100 మందికి పైగా సిబ్బంది ఇంకా గల్లంతయ్యారని సమాచారం.
అంతేకాకుండా అమెరికా సైన్యం ఇకపై కేవలం తీరాలకు లేదా సముద్రానికే పరిమితం కాదని, ఇరాన్ సైనిక నిర్మాణం, నాయకత్వం, క్షిపణి స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయడానికి ఇరాన్ భూభాగంలోని నేల స్థావరాలపై కూడా దాడులు చేస్తామని హెగ్సెత్ హెచ్చరించారు.