Buddha Venkanna : మంగమ్మ శపథం అంటూ నోరు పారేసుకున్న కొడాలి నాని ఎక్కడ?
Buddha Venkanna : ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమని, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలనే అవమానిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
- Author : Kavya Krishna
Date : 15-12-2024 - 6:27 IST
Published By : Hashtagu Telugu Desk
Buddha Venkanna : ఎమ్మెల్యేలు అసెంబ్లీని దేవాలయంగా పరిగణించాలి, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. వారు అసెంబ్లీకి రాకున్నా కూడా ప్రతినెలా లక్షా 75వేల రూపాయలు జీతాలుగా వారి ఖాతాలో పడిపోతున్నారని తెలిపారు. ఈ క్రమంలో, “ఇంకా ఈ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మేము గొర్రెలు లేదా మేకలుగా పరిగణిస్తామని” ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న. వైసీపీలో 11 మంది మేకలు ఉన్నట్లు, వారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
అంతేకాదు, వారిలో ఒక పెద్ద మేక ఉందని, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు అని వ్యాఖ్యానించారు. “గతంలో సీఎంగా ఉన్న జగన్కు ప్రజలు తగిన బుద్ది చెప్పారు, ఇప్పుడు బెంగుళూరు పారిపోయారని” ఆయన అన్నారు. “అసెంబ్లీకి రాని ఈ 11 మందికి ఎమ్మెల్యేలుగా కొనసాగడం అనర్హత. వెంటనే రాజీనామా చేయాలని” డిమాండ్ చేశారు. చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లినప్పుడు ఓ కారణం ఉందని, “అనంతరం మిగతా సభ్యులు ప్రజల తరపున గళం విప్పారని” చెప్పారు.
ప్రతిపక్ష హోదా కోసం జగన్ 18 సీట్లు కావాలని గతంలో చెప్పారని, “ఇప్పుడు గెలిచిన 11 వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున మాట్లాడాలని” కోరారు. “లేదంటే, ఇప్పటివరకు తీసుకున్న జీతాలు వెనక్కి ఇచ్చి, రాజీనామాలు చేయాలని” డిమాండ్ చేశారు.
“మంగమ్మ శపథం అంటూ నోరు పారేసుకున్న కొడాలి నాని ఎక్కడ?” అని ప్రశ్నించారు. “చంద్రబాబుది చాణక్య శపథం, అందుకే ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు” అని చెప్పారు. “చంద్రబాబుకి, వల్లభనేని వంశీలకు ఆచూకీ తెలిపితే రూ. 1,116 బహుమానం ఇస్తామని” ఎద్దేవా చేశారు.
మరింతగా.. “జగన్ విధానాలు, పోకడలు నచ్చక వైసీపీని వీడి చాలా మంది బయటకు వస్తున్నారు. త్వరలో వైసీపీ ఖాళీ అవుతుందని” అభిప్రాయపడ్డారు. “జగన్ తన పని అయిపోయిందని భావించి, బెంగళూరుకు పూర్తిగా మకాం మార్చాలని చూస్తున్నారు” అని బుద్దా వెంకన్న తెలిపారు.
Read Also : Pemmasani Chandrasekhar : “ఒకే దేశం, ఒకే ఎన్నిక” విధానం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది