Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- Author : Vamsi Chowdary Korata
Date : 02-04-2026 - 5:26 IST
Published By : Hashtagu Telugu Desk
అమరావతి చట్టబద్ధత బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇదివరకే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ బిల్లుపై చర్చను ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు.
రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. కాగా, రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టంగా మారనుంది. సభలో 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. పది పార్టీలకు చెందిన ఎంపీలు మద్దతు ఇచ్చారు.