Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి
- Author : Vamsi Chowdary Korata
Date : 28-03-2026 - 2:02 IST
Published By : Hashtagu Telugu Desk
Daggubati Purandeswari రాజమండ్రి – కాకినాడ పోర్ట్ మధ్య రోజూ ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఈ మార్గంలో తాత్కాలికంగా నడుస్తున్న స్పెషల్ రైలును ఇకపై శాశ్వత సర్వీస్గా మారుస్తున్నట్లు ప్రకటించింది. రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు 07523/07524 నంబర్లతో స్పెషల్ ట్రైన్గా నడుస్తున్న ఈ సర్వీస్ను, ఇక నుంచి 67301/67302 నంబర్లతో రాజమండ్రి – కాకినాడ పోర్ట్ MEMU ఎక్స్ప్రెస్గా శాశ్వత ప్రాతిపదికన నడపనున్నారు. ఈ మార్పునకు ఆమోదం తెలిపినందుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు పురందేశ్వరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ నిర్ణయంతో రాజమండ్రి, కాకినాడ మధ్య రాకపోకలు సాగించే వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. తక్కువ ఛార్జీలతో సౌకర్యవంతమైన, శాశ్వత రైలు సర్వీస్ అందుబాటులోకి రావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని పురందేశ్వరి పేర్కొన్నారు.