Ntr Bharosa Pension Scheme : ఏపీలో కొత్త వితంతు పింఛన్లు మంజూరు..నెలకు రూ.4వేలు
ప్రభుత్వ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.29.60 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి స్పౌజ్ పింఛన్ విధానం అమలులోకి వచ్చింది.
- Author : Latha Suma
Date : 11-06-2025 - 2:35 IST
Published By : Hashtagu Telugu Desk
Ntr Bharosa Pension Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరీలో కొత్తగా 71,380 పింఛన్లను మంజూరు చేసింది. ఈ నెల 12వ తేదీన, గురువారం, లబ్ధిదారులకు ఈ పింఛన్లను అధికారికంగా పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.29.60 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి స్పౌజ్ పింఛన్ విధానం అమలులోకి వచ్చింది. సామాజిక భద్రతా చట్టం కింద ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం అమలులో ఉన్నవారి కోసం ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం 71,380 మందిని అర్హులుగా గుర్తించి, వారికి మే నెల పింఛన్ రూ.4,000 చొప్పున జూన్ 12న ఇవ్వనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు లేదా పింఛన్ను ప్రత్యక్షంగా అందించనున్నారు. ఇప్పటికే ఈ పింఛన్ల మొత్తాన్ని సంబంధిత సచివాలయాల ఖాతాల్లో జమ చేశారు. ప్రతి లబ్ధిదారుడికి రూ.4,000 చొప్పున మొత్తం రూ.29.60 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ స్పౌజ్ పింఛన్ పొందడానికి లబ్ధిదారుల నుండి మరణ ధ్రువీకరణ పత్రం, భర్త పేరు, పింఛన్ వివరాలు, భార్య వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్షేమ సహాయకులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు లాగిన్ ద్వారా దరఖాస్తుల పరిశీలన చేసి అర్హత నిర్ణయించారు.
కొన్ని దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి వాటి వివరాలు..
.భార్యకు ముందే పింఛన్ ఉండటం
.హౌస్హోల్డ్ మ్యాపింగ్లో భార్యాభర్తలు వేర్వేరుగా ఉండటం
.మరణ ధ్రువపత్రం సమర్పించకపోవడం
.భార్యాభర్తలిద్దరూ మరణించటం
.దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడం
.సాంకేతిక లోపాలు
.భార్య ప్రభుత్వ ఉద్యోగి కావడం
.భార్య మళ్లీ వివాహం చేసుకోవడం వంటి కారణాలతో అనేక దరఖాస్తులను తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో తిరస్కరణకు గల కారణాలను అధికారికంగా వివరించారు. ప్రభుత్వం అందించిన ఈ స్పౌజ్ పింఛన్ పథకం వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక భద్రత పొందనున్నాయి. ముఖ్యంగా భర్తను కోల్పోయిన గృహిణులకు ఇది ఎంతో మద్దతుగా నిలవనుంది. ఈ నెల 12వ తేదీ, గురువారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా స్పౌజ్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఇందులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
Read Also: Prisoners Exchange : రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి