మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం
- Author : Vamsi Chowdary Korata
Date : 20-02-2026 - 12:23 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్పై విసిరివేయడంపై ఎన్డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని సభ్యులు ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామి చిత్రాలను ప్లకార్డులుగా ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు.
చెప్పులు, షూలు వేసుకుని సభకు రావడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ మిత్రపక్షాల సభ్యులు.. హిందూమత సంప్రదాయాలను గౌరవించడం లేదని విమర్శించారు. వేంకటేశ్వర స్వామిని రోజూ సభలో అపవిత్రం చేస్తున్నారన్నారు. ‘గోవింద గోవింద’ అంటూ గోవింద నామాలపై నినాదాలు చేయడం ఏమిటని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రశ్నించారు. దేవుడి ఫొటోలను టేబుల్పై విసిరేసి వెళ్లడం దేవదేవుడికే అపచారమని కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైసీపీ సభ్యులు తక్షణమే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అప్పటివరకు సభ జరగేదిలేదని స్పష్టం చేశారు.