Palamaner Krishnagiri National Highway : రూ.800 కోట్లతో.. ఏపీలో కొత్త జాతీయ రహదారి..!
- By Vamsi Chowdary Korata Published Date - 01:51 PM, Sat - 15 November 25
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో కృష్ణగిరి-పలమనేరు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ పనులు పూర్తయితే ఏపీ నుంచి తమిళనాడుకు రాకపోకలు సులభతరం అవుతాయి. రూ.800 కోట్ల అంచనా వ్యయంతో 82 కి.మీ రోడ్డు విస్తరణ జరగనుంది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జాతీయరహదారులపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో పనుల్ని వేగవంతం చేస్తున్నారు. కొన్ని హైవేల పనులు ముగింపు దశకు రాగా.. మరికొన్ని ఒకటి, రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్రాంలో మరికొన్ని కొత్త రోడ్లను విస్తరించేందుకు ప్రతిపాదనలు చేస్తోంది. ఈ మేరుకు కేంద్రానికి ప్రతిపాదనల్ని పంపుతోంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో మరో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
చిత్తూరు జిల్లా కృష్ణగిరి-పలమనేరు రోడ్డును విస్తరించున్నారు. ఈ మేరకు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రహదారి విస్తరణ పనులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. జాతీయ రహదారుల శాఖ ఈ అభివృద్ధి పనులను చేపట్టనుంది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రోడ్డు.. పలమనేరు నుంచి బైరెడ్డిపల్లె, వి.కోట మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి వరకు నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ విస్తరణతో ప్రయాణం వేగవంతం అవుతుంది. వాహనాల రద్దీ కూడా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల శాఖ పర్యవేక్షిస్తుంది. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
ఈ హైవే ప్రతిపాదన ప్రస్తుతం డీపీఆర్ దశలో ఉందని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు త్వరలోనే టెండర్లు పిలువనున్నారు. ఈ టెండర్ల పక్రియ పూర్తయ్యాక భూసేకరణ మొదలు పెడతారు. ఇప్పటికే ఎక్స్ప్రెస్ హైవే పనులు దాదాపు ముగింపు దశకు వచ్చాయి. ఈ హైవే పనులు కూడా పూర్తి చేస్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వైపు, కర్ణాటక వైపు త్వరగా వెళ్లొచ్చు. రవాణాకు కూడా అనుకూలంగా ఉంటుంది. అధికారులు ఇప్పటికే పలమనేరు నుంచి కుప్పం వరకు భూసేకరణ సమస్యలు రాకుండా చర్యలు చేపట్టారు. ఈ రోడ్డులో దారి పొడవునా కల్వర్టులు, వంతెనలు ఎన్ని అవసరమో తర్వాత నిర్ణయిస్తారు.
ఈ కల్వర్టలు, బ్రిడ్జిలు నెల రోజుల్లో ప్రక్రియ మొదలవుతుందని ఎన్హెచ్ అధికారులు తెలిపారు. కృష్ణగిరి-పలమనేరు వరకు 82 కి.మీ రోడ్డును విస్తరించనున్నారు.. అంచనా వ్యయం రూ.800 కోట్లని చెబుతున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో హైవేలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం పరిధిలో కొన్ని రోడ్లను విస్తరిస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి అటు తమిళనాడు, ఇటు కర్ణాటకకు కనెక్టివిటీ ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ పనుల్ని వేగవతం చేస్తోంది.