Chandrababu Naidu: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్
- Author : Vamsi Chowdary Korata
Date : 15-04-2026 - 12:28 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Lokesh తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి, కొత్త సమీకరణలకు అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీ మంత్రి నారా లోకేశ్ను నియమించారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ల అనుభవానికి, యువత ఉత్సాహానికి సమ ప్రాధాన్యం ఇస్తూ, సామాజిక కోణంలో కమిటీలను కూర్పు చేసినట్లు ఆయన తెలిపారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు అన్ని సమీకరణలను బేరీజు వేసుకుని ఈ కసరత్తు చేశారని పల్లా పేర్కొన్నారు. 29 మందితో పొలిట్బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీకి విధేయులుగా ఉంటూ, కష్టపడి పనిచేసిన వారికి ఈ నియామకాల్లో పెద్దపీట వేశామని స్పష్టం చేశారు. గతానికి భిన్నంగా, క్షేత్రస్థాయి కార్యకర్తలకు సైతం అత్యున్నత పదవులు కట్టబెడుతూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్చార్జి గుత్తికొండ ధనుంజయ్కు నేరుగా పొలిట్బ్యూరోలో స్థానం కల్పించడమే ఇందుకు నిదర్శనమని వివరించారు.
ఈ కమిటీల కూర్పులో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. 185 మంది సభ్యులున్న రాష్ట్ర కమిటీలో 122 మంది బడుగు, బలహీన వర్గాల వారేనని పల్లా తెలిపారు. ఇందులో బీసీలకు 77 (40%), ఎస్సీలకు 25 (25%), ఎస్టీలకు 7 (3.8%), మైనార్టీలకు 13 (7%) చొప్పున స్థానాలు కల్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా… పొలిట్బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ వారికి సముచిత స్థానం కల్పించారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, నియోజకవర్గాల పునర్విభజన, 33 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి భవిష్యత్ పరిణామాలను అంచనా వేస్తూ ఈ కమిటీలను రూపొందించారని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నియామకాల ద్వారా నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన వారికి న్యాయం చేశామని, పార్టీ బలోపేతానికి ఈ మార్పులు దోహదపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.