MBiPC Benefits : ఇంటర్లో ఇక ఎంబైపీసీ గ్రూపు.. కొత్త మార్పులు, మార్కుల వివరాలివీ
వాస్తవానికి ఎంబైపీసీ కోర్సును సీబీఎస్ఈ(MBiPC Benefits) ఇప్పటికే అమలు చేస్తోంది. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లోనూ కొన్నిచోట్ల ఈ గ్రూపును అందిస్తున్నారు.
- By Pasha Published Date - 09:43 AM, Wed - 9 April 25

MBiPC Benefits : ఇంటర్మీడియట్లోని ఎంపీసీ, బైపీసీ కోర్సుల గురించి మనకు తెలుసు. ఎంబైపీసీ కోర్సు గురించి మనకు తెలియదు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ఏపీలో ఎంబైపీసీ కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఈ కోర్సులో మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమెస్ట్రీ అనే నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. ఇంటర్ తర్వాత వీలైనన్ని ఎక్కువ కెరీర్ అవకాశాలను చూపించే కోర్సుగా ఇది విద్యార్థులకు ఉపయోగపడనుంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రైవేటు కాలేజీల్లో ఎంబైపీసీ గ్రూపు అందుబాటులో ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ కోర్సు లేదు.
Also Read :New Aadhaar App: సరికొత్త ఆధార్ యాప్.. ఇక ఆ పనులన్నీ ఈజీ
ఏ కోర్సు చదివితే.. ఏ కెరీర్.. ?
వాస్తవానికి ఎంబైపీసీ కోర్సును సీబీఎస్ఈ(MBiPC Benefits) ఇప్పటికే అమలు చేస్తోంది. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లోనూ కొన్నిచోట్ల ఈ గ్రూపును అందిస్తున్నారు. ఎంపీసీ చదివితే ఇంజినీరింగ్ సంబంధిత కెరీర్ అవకాశాలను అందుకోవచ్చు. బైపీసీ చదివితే మెడిసిన్, ఫార్మసీ వంటి కోర్సుల్లో చేరొచ్చు. ఎంబైపీసీ చేస్తే విద్యార్థులకు మ్యాథ్స్, బయాలజీ రెండింటిపైనా పట్టు పెరుగుతుంది. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ ఎటువైపుగా వెళ్లొచ్చు. బయాలజీతో పాటు మ్యాథ్స్ చదివిన వారికి బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ వంటి రంగాల్లో జాబ్స్ వస్తాయి.
కొత్త మార్పులు, కొత్త మార్కులు
- ఇప్పటివరకు ఇంటర్ కాలేజీల్లో వృక్షశాస్త్రం(బోటనీ), జంతుశాస్త్రం(జువాలజీ) వంటి సబ్జెక్టులు వేర్వేరుగా ఉండేవి. ఇప్పుడు ఆ రెండు సబ్జెక్టులను కలిపి జీవశాస్త్రం (బయాలజీ)గా ఏపీలో తీసుకొచ్చారు. ఇకపై జీవశాస్త్రం ప్రశ్నపత్రం 85 మార్కులకు ఉంటుంది. ఇందులో వృక్షశాస్త్రానికి 43 మార్కులు, జంతుశాస్త్రానికి 42 మార్కులు ఉంటాయి.
- ఇప్పటిదాకా భౌతిక, రసాయన శాస్త్ర పేపర్లకు 60 మార్కులు చొప్పున ఉండేవి. ఇకపై 85 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్ర సబ్జెక్టులకు 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ను నిర్వహిస్తారు.
- ఇప్పటివరకు మ్యాథ్స్ -ఎ, బి సబ్జెక్టులు ఉండేవి. వాటిని కలిపి ఒకే సబ్జెక్టుగా మార్చారు. ఇప్పటివరకు మ్యాథ్స్ ఏ, బీ పేపర్లకు 75 మార్కుల చొప్పున 150 మార్కులు ఉండగా, ఇపుడు ఈ రెండు పేపర్లు కలిపి 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
- ఎంపీసీ, బైపీసీ వేర్వేరుగా చదివితే, ఇంగ్లిష్తోపాటు సెకండ్ లాంగ్వేజీ కింద తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్, తమిళం, కన్నడ, ఒడియా, పర్షియన్, ఫ్రెంచ్ ఆప్షన్లు ఉన్నాయి. ఎంబైపీసీ తీసుకుంటే ఇంగ్లిష్ ఒక్కటే చదివితే సరిపోతుంది. సెకండ్ లాంగ్వేజీ ఆప్షన్ తీసుకోనక్కర్లేదు.
- మొత్తంగా ఎంబైపీసీలో గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులు ఒక్కోటి 100 మార్కుల చొప్పున ఉండనున్నాయి. వీటితో పాటు ఇంగ్లిష్ (100 మార్కులకు) లాంగ్వేజీగా ఉంటుంది.
- మార్కుల విధానంలోనూ మార్పులు చేసి మొత్తం వెయిటేజీ 1,000 (రెండేళ్లకు) మార్కులు వచ్చేలా ఇంటర్ బోర్డు మార్పులు చేసింది.