Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ
- Author : Vamsi Chowdary Korata
Date : 12-06-2026 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చి వెళ్లిన సవాళ్లు, సంక్షోభాలను అధిగమించి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. “ఐదు కోట్ల ప్రజల అపారమైన నమ్మకంతో ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, అపరిష్కృత సమస్యల వారసత్వాన్ని మిగిల్చి వెళ్లగా, వాటన్నింటినీ అధిగమించి మేము ముందుకు సాగుతున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
పాలనపై తమ ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ.. “అధికారం ఒక బాధ్యత అని, పాలకులు ప్రజలకు సేవకులని మా ప్రగాఢ నమ్మకం. ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం, సమాజంలోని ప్రతి వర్గం విజయం, శ్రేయస్సే మా ఎజెండా. వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం” అని చంద్రబాబు అన్నారు.
ఈ రెండేళ్ల ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. “రాష్ట్ర అభివృద్ధికి ప్రతి అడుగులో అండగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరపున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో ‘స్వర్ణాంధ్ర’ దిశగా పయనిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల మద్దతు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
పునరుద్ధరించబడిన ఆశావాదం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ‘ఎక్స్’లో స్పందించారు. “రెండేళ్ల క్రితం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కొత్త ప్రారంభం కోసం ఎన్డీఏపై నమ్మకం ఉంచారు. మా ముందున్న సవాళ్లు చాలా పెద్దవి. రాష్ట్ర భవిష్యత్తుపై తిరిగి విశ్వాసం నింపడం అంత సులభమైన పని కాదు” అని ఆయన పేర్కొన్నారు.
“గడిచిన రెండేళ్లలో ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బలమైన కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ను తిరిగి వృద్ధి, అవకాశాలు, అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం జరిగింది. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నప్పటికీ, ఈ రోజు మన ప్రజల్లో పునరుద్ధరించబడిన ఆశావాదం, రాష్ట్రం సరైన దిశలో పయనిస్తోందన్న విశ్వాసం మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తోంది. ప్రజలు మాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు” అని రామ్మోహన్ నాయుడు తన పోస్టులో పేర్కొన్నారు.