Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
- Author : Vamsi Chowdary Korata
Date : 12-06-2026 - 12:25 IST
Published By : Hashtagu Telugu Desk
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా… ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచించిందంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైసీపీ హైకమాండ్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగా తాడిపత్రిలో నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నించారు. అయితే, శాంతిభద్రతల సమస్యలను ఉదహరిస్తూ పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కానీ, పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా పెద్దారెడ్డి వేదిక వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో… పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, పెద్దారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల వైపు దూసుకురావడంతో… భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు పెద్దారెడ్డిని అనంతపురంకు తరలించారు.
ఘర్షణకు దారితీసిన నేపథ్యం:
ఒకవైపు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైసీపీ నిరసనలకు సిద్ధమవగా, మరోవైపు అధికార కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల అమలును చాటిచెబుతూ రెండేళ్ల పాలనా ఉత్సవాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణంలో భారీ బైక్ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఒకే ప్రాంతంలో ఇరు పార్టీలు పరస్పర విరుద్ధ కార్యక్రమాలకు ప్లాన్ చేయడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉందని పోలీసులు భావించారు.
ఈ క్రమంలో, వైసీపీ నిరసన కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు మొదట పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఆయన కచ్చితంగా కార్యక్రమంలో పాల్గొంటానని భీష్మించుకోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా తాడిపత్రి అంతటా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.