Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?
- Author : Vamsi Chowdary Korata
Date : 21-06-2026 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
400 మంది సిబ్బంది.. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు.. దట్టమైన భూభాగాన్ని జల్లెడ పట్టే థర్మల్ డ్రోన్లు.. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా విశ్లేషణ.. అడవిలో రహస్యంగా అమర్చిన కెమెరా ట్రాప్లు, జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో నింపిన బొమ్మలు.. లక్ష రూపాయల రివార్డు.. కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం గ్రామంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలివి. అయినా ఫలితం లేదు. గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలయ్యాయి.. పాప జాడ మాత్రం కానరావటం లేదు. జ్ఞానేశ్వరి అదృశ్యం, పాప ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్.. ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద గాలింపు చర్యలలో ఒకటిగా మారింది.
జూన్ 6న ఘటన..
సుంకర గణేష్, భవాని దంపతులు సీహెచ్ అగ్రహారంలో ఉన్న 50 ఎకరాల పామాయిల్ తోటలో సంరక్షకులుగా పనిచేస్తున్నారు. జూన్ ఆరో తేదీ.. భవానీ వంట పనిలో, గణేష్ ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పాప జ్ఞానేశ్వరి భవానీ వద్ద ఉందని, గణేష్ వద్ద ఉందని దంపతులు భావించారు. అయితే కొన్ని గంటల తర్వాత చిన్నారి కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. అదే రోజు మధ్యాహ్నం, ఆ ఊరికి చెందిన ఒక వ్యక్తి జ్ఞానేశ్వరిని కొండ సమీపంలో, పెంపుడు కుక్కతో పాటుగా చూశానని చెప్పారు. చిన్నారి దగ్గరకు వెళ్లి ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తే.. కుక్క తీవ్రంగా ప్రతిఘటించిందని తెలిపారు. ఆ తర్వాత అతను జ్ఞానేశ్వరి కుటుంబానికి ఆ విషయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత నుంచి జ్ఞానేశ్వరి ఇంకెవరికీ కనిపించలేదు.
పాప కనిపించకుండా పోయిందనే ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 40 మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. వీరంతా చెరువులు, గుంటలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. అలాగే దట్టమైన అడవిలో దారి చూపేందుకు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ నుంచి అటవీ శాఖ నిపుణులను రప్పించారు. థర్మల్-ఇమేజింగ్ డ్రోన్లతో రాత్రి వేళ ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. 38 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. 170కి పైగా ఫోన్ రికార్డులను విశ్లేషించారు, కానీ.. ప్రయోజనం లేకపోయింది.
జూన్ 9న అనుకోని ఘటన..
జూన్ 9న అనుకోని ఘటన చోటుచేసుకుంది. జ్ఞానేశ్వరి అదృశ్యమైనప్పుడు ఆమెతో ఉన్నట్లుగా చెప్తున్న పెంపుడు కుక్క ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుక్క వింతగా ప్రవర్తించింది. ఆహారం తినకుండా, మనుషులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ దూకుడుగా కనిపించింది. జ్ఞానేశ్వరి అదృశ్యమైన సుమారు గంట తర్వాత, ఆ పెంపుడు కుక్క ప్రధాన రహదారిపై తిరుగుతూ, ఒక ఆలయం దగ్గర కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే సమయంలో పోలీసులు గుర్తించారు. అయితే ఆలయం వద్ద నుంచి ఆ కుక్క ఎక్కడికి వెళ్లింది, రెండు రోజులు ఎక్కడ ఉంది అనేది ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది.
పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్.. అనుకోని విధంగా..
ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే.. జ్ఞానేశ్వరి వెళ్ళిందని భావిస్తున్న రహదారికి.. పూర్తిగా భిన్నమైన మార్గం ద్వారా పెంపుడు కుక్క తిరిగి ఇంటికి చేరుకుంది. చిన్నారి ఆచూకీని కనిపెట్టేందుకు ఆ పెంపుడు కుక్కనే కీలక ఆధారంగా పోలీసులు భావించారు. జూన్ 12వ తేదీ ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ను అమర్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఆ కుక్క పండ్ల తోటలు, ఆ చుట్టుపక్కల పరిసరాలలో చాలా కిలోమీటర్లు తిరిగిన తర్వాత బలహీనపడిపోయి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అది చనిపోయింది.