Vijayasai Reddy Organic Farming: ‘జీవామృతం’ తయారు చేసి ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించాలి : విజయసాయిరెడ్డి
- Author : Vamsi Chowdary Korata
Date : 21-03-2026 - 2:31 IST
Published By : Hashtagu Telugu Desk
Vijayasai Reddy వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. పూర్తి సమయాన్ని వ్యవసాయానికే కేటాయిస్తూ, పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన హైదరాబాద్ శివార్లలోని తొండుపల్లి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువు అయిన ‘జీవామృతం’ తయారుచేస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు.
సేంద్రీయ వ్యవసాయంలో భూమిలో మిత్ర పురుగులు, ఎర్రలు, వానపాములు, సూక్ష్మజీవులు భూసారం పెంచి పోషకాలతో అధిక దిగుబడి కోసం “జీవామృతం” వాడుతాం. ఆవు పేడ, ఆవు మూత్రం, తాటిబెల్లం, సెనగ కందుల పిండి. పుట్టమట్టి ని సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కర్రతో సవ్యదిశలో రోజుకు రెండు సార్లు చొప్పున మూడు… pic.twitter.com/mEIn1a8xIq
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 21, 2026
ఈ వీడియోలో జీవామృతం తయారీ విధానాన్ని ఆయన స్వయంగా వివరించారు. “సేంద్రియ వ్యవసాయంలో భూమిలో మిత్ర పురుగులు, ఎర్రలు, వానపాములు, సూక్ష్మజీవులు భూసారం పెంచి పోషకాలతో అధిక దిగుబడి కోసం ‘జీవామృతం’ వాడతాం. ఆవు పేడ, ఆవు మూత్రం, తాటిబెల్లం, సెనగ కందుల పిండి, పుట్టమట్టిని సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కర్రతో సవ్యదిశలో రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు తిప్పి జీవామృతం తయారుచేస్తాం. దీన్ని తొండుపల్లి వ్యవసాయక్షేత్రంలో చెట్లకు పోస్తాం” అని విజయసాయిరెడ్డి తెలిపారు.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి, పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, అప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలకు పూర్తిగా దూరమయ్యారు. ఒకప్పుడు పార్టీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో నంబర్ 2గా చక్రం తిప్పిన ఆయన, ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ తన వ్యవసాయ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.