Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని
- Author : Vamsi Chowdary Korata
Date : 21-05-2026 - 2:48 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ తాను రాష్ట్ర రాజధానిని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర నిర్మించాలని ఆనాడే జగన్కు చెప్పానన్నారు. జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలతో మరోసారి మావిగన్ అంటున్నారని.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మావిగన్ ఏమైందని ప్రశ్నించారు. తాను ఆనాడే కుటుంబాల జోలికి వెళ్లొద్దని చెప్పినా వినలేదన్నారు. వైఎస్ జగన్కు కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదని బాలినేని అన్నారు.
వైఎస్సార్సీపీని బలోపేతం చేయడం జగన్ వల్ల కావడం లేదని మాజీ మంత్రి, జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు, మొండి వైఖరితో పార్టీని, రాష్ట్రాన్ని దెబ్బతీశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ నాయకత్వ లోపం, ఒంటెద్దు పోకడల కారణంగానే నేతలు, ప్రజలు పార్టీకి దూరమయ్యారని అన్నారు. పార్టీని అభివృద్ధి చేయడం జగన్కు చేతకాదంటూ ఎద్దేవా చేశారు. జగన్ తీసుకున్న కొన్ని మూర్ఖపు నిర్ణయాల కారణంగానే 2024 ఎన్నికల్లో తాను ఓడిపోయానని అన్నారు. తాను ఓడిపోవడానికి వ్యక్తిగతమైన అంశాలు కారణం కాదని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్ సీఎంగా బటన్లు నొక్కారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
హయాంలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధానిని ఏర్పాటు చేస్తే బావుంటుందని జగన్కు చెప్పానని, కానీ ఆయన పట్టించుకోలేదని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను రాజధాని విషయంలో సజ్జలకు కూడా సూచనలు చేశానని, ఎవరూ పట్టించుకోలేదన్నారు. మరోసారి జగన్ మావిగన్ పేరుతో మరో మూర్ఖత్వపు నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధాని మావిగన్ అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తన కుమారుడు బాలినేని ప్రణీత్ ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను ఎన్నికల తర్వాత జనసేన పార్టీలో చేరానని, కాబట్టి తనకు పదవులు అడగడానికి అర్హత లేదని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.
పెట్రోల్ ధరలు పెరగడానికి కూటమి కారణం అన్నట్లు వైఎస్సార్సీపీ ధర్నా చేసిందని, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వమన్న సంగతి జగన్కు తెలియదా అంటూ బాలినేని ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీని జగన్ ఎదురించి పార్టీ పెట్టారని అందరూ పొగిడారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి జగన్కు ధైర్యం లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాల గురించి విమర్శించిన సమయంలో 30 మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఖండించానన్నారు. అప్పుడే జగన్ పార్టీ నేతల్ని కంట్రోల్ చేసి ఉంటే బావుండేదన్నారు, అసలు జగన్కు క్రెడిబులిటీ లేదన్నారు. తాను ఎప్పుడూ పాలసీలపై మాట్లాడతానని, ఎప్పుడూ ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు.