Rain Alert: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
- Author : Vamsi Chowdary Korata
Date : 12-06-2026 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమ, కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలను తాకిన రుతుపవనాలు, రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా పూర్తిగా విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల కదలిక చురుగ్గా ఉండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తెలంగాణ నుంచి దక్షిణ కోస్తా వరకు మరో ద్రోణి ఏర్పడింది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరోవైపు పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు పలు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని సూచించింది. ఇప్పటికే బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు విజయవాడతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ ఏడాది ఆరంభంలో ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉంటుందనే అంచనాలు వెలువడినప్పటికీ, జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుండటం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. ప్రభుత్వం ఇప్పటికే పంట కాలువలకు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించడంతో, రైతులు ఖరీఫ్ సాగు పనులను ముమ్మరం చేశారు. తాజా వర్షాలు వ్యవసాయ పనులకు మరింత ఊతమిచ్చాయి.